Forbes Asia : దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలిస్థానంలో నిలిచిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ… ఇప్పుడు మరో ఘనత సాధించారు. ఆసియాలో దాతృత్వంలో ముందున్న వారిలో ఆయన చోటు దక్కించుకున్నారు. అదానీతో పాటు శివ్ నాడార్, అశోక్ సూతా, మలేషియన్-ఇండియన్ వ్యాపారవేత్త బ్రహ్మల్ వాసుదేవన్, ఆయన భార్య శాంతి కండియా కూడా ‘ఫోర్బ్స్ ఆసియాస్ హీరోస్ ఆఫ్ ఫిలాంత్రపీ’లో చోటు దక్కించుకున్నారు.
ఈ ఏడాది జూన్లో తన 60వ పుట్టిన రోజు సందర్భంగా రూ.60,000 కోట్లు దానం చేస్తున్నట్లు అదానీ ప్రకటించారు. ఈ డబ్బును అదానీ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం వినియోగించనున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఏటా దేశవ్యాప్తంగా 37 లక్షల మందికి సహాయం అందిస్తూ వస్తున్నారు… అదానీ.
ఇక హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ్ నాడార్… తన ఫౌండేషన్ ద్వారా కొన్ని దశాబ్దాలుగా 8 వేల కోట్ల రూపాయలకు పైగా విరాళాలు ఇచ్చారు. ఈ ఏడాది తన ఫౌండేషన్కు రూ.1,160 కోట్ల మేర విరాళమిచ్చారు. విద్య ద్వారా సమాజంలో సమానత్వాన్ని సాధించడం కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను కూడా శివ్ నాడార్ ఏర్పాటు చేస్తున్నారు.
సాంకేతిక దిగ్గజం, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయిన అశోక్ సూతా… ఒక వైద్య పరిశోధనా ట్రస్టు ఏర్పాటు చేసి, దానికి రూ.600 కోట్ల మేర విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ డబ్బును వచ్చే పదేళ్లలో ఖర్చు చేయనున్నారు. హ్యాప్పియెస్ట్ మైండ్స్ టెక్నాలజీలో మెజారిటీ వాటా కలిగిన ఆయన, దాని నుంచి సంపద పొందుతున్నారు. ఇప్పటికే సైంటిఫిక్ నాలెడ్జ్ ఫర్ ఏజింగ్ అండ్ న్యూరోలాజికల్ ఎయిల్మెంట్స్ పేరిట అశోక్ ఏర్పాటు చేసిన ట్రస్టు… నిరుడు పలు ప్రాజెక్టులకు రూ.20 కోట్ల నిధులిచ్చింది.
మరోవైపు… మలేషియాలో స్థిరపడిన భారతీయ జంట బ్రహ్మల్ వాసుదేవన్, ఆయన భార్య శాంతి కండియా… తమ క్రెడార్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సాయం చేస్తున్నారు. మలేషియాలో ఒక బోధనాసుపత్రికి 11 మిలియన్ డాలర్లను ఇచ్చిన ఈ జంట… ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్కు కూడా 30 మిలియన్ డాలర్లను ఇచ్చారు.