BAN Women vs IND Women: టీమ్ ఇండియా అమ్మాయిలు ఆసియా కప్ లో అదరగొడుతున్నారు. నేడు బంగ్లాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేశారు. స్మ్రతి మంథాన ఒంటి చేత్తో విజయాన్ని అందించింది. దీంతో భారత్ సగర్వంగా ఫైనల్ లో అడుగుపెట్టింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు ఇద్దరూ వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలో విజయ తీరాలకు చేర్చారు. భారత్ ని సునాయాసంగా ఫైనల్ కి తీసుకువెళ్లారు.
వివరాల్లోకి వెళితే 81 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు స్మ్రతి మంధాన, షెఫాలీ వర్మ ఇద్దరూ సూపర్ గా ఆడారు. ముఖ్యంగా స్మ్రతి అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 39 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇందులో 1 సిక్సర్, 9 ఫోర్లు ఉన్నాయి.
ఇకపోతే బంగ్లాదేశ్ బౌలింగులో ఎవరికి వికెట్లు పడలేదు. కాకపోతే స్మ్రతి మంధాన మాత్రం క్యాచ్ ఇస్తే, అది నో బాల్ అయ్యింది. అలాగే షఫాలీ వర్మ ఇచ్చిన క్యాచ్ ని బౌండరీ లైను వద్ద బంగ్లా ఫీల్డర్ నేలపాలు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కి ఆది నుంచి శుభారంభం దక్కలేదు. ఒకదశలో భారత బౌలర్లు వారిని వణికించారు. కెప్టెన్ నిగర్ సుల్తానా (32) ఒక్కరే భారత బౌలర్లను ఎదిరించి నిలిచింది. తర్వాత షోమా అక్తర్ (19) నాటౌట్ గా నిలిచింది. మిగిలిన అందరూ సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోయారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బౌలర్లలో రేణుకా సింగ్ 3, రాధాయాదవ్ 3 వికెట్లు తీసి బంగ్లా వెన్ను విరిచారు. పూజా, దీప్తీ చెరొక వికెట్ పడగొట్టారు.
నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య సాయంత్రం జరిగే మరో సెమీఫైనల్ పోరులో ఎవరు గెలుస్తారో వారితో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో మనవాళ్లు తలపడతారు.