Nara Lokesh: మాజీ మంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం నారా లోకేశ్ మాట్లాడారు. జగన్ పై విమర్శలు సంధించారు. ఢిల్లీలో జగన్ అన్నీ అసత్యాలే చెబుతున్నారని, ఆయన అసెంబ్లీకి వచ్చి చెబితే.. తాము ఆయనకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. వైసీపీ నేతలు బూతులు తిడతారని, కానీ, కూటమి నేతలు ఆ పని చేయరని హామీ ఇచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, కానీ, ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణల పర్వం కోసం జగన్ ఇప్పటికే ఐదు ప్రెస్మీట్లు పెట్టాడని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయాక జగన్ ఈ స్వల్ప కాలంలోనే ఐదు ప్రెస్ మీట్లు పెట్టాడని, అదే అధికారంలో ఐదేళ్లు ఉన్నప్పుడు రెండు ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టాడని విమర్శించారు. ఈ విషయాన్ని అందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం నారా లోకేశ్ తన వద్ద ఉన్న రెడ్ బుక్ పై వచ్చిన వ్యాఖ్యలపై స్పందించారు. తన వద్ద ఉన్న రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నాడని విమర్శించారు. తన వద్ద రెడ్ బుక్ ఉన్నదని తానే స్వయంగా చాలా సార్లు బహిరంగ సభల్లో చెప్పానని తెలిపారు. తప్పు చేసిన వారి పేర్లు ఆ రెడ్ బుక్లో పొందుపరిచానని వివరించారు. వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని ఇది వరకే చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని వివరించారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందని, వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల హత్యలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందినందున రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు సంధించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హత్యలకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, వీడియోలను ఆయన ప్రదర్శనకు పెట్టారు.
Also Read: పక్క చూపులు చూస్తున్న వైసీపీ నేతలు.. ఈ పరిస్థితుల్లో పార్టీ నిలబడుతుందా? భవిష్యత్తు ఏమిటీ?
రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీ టూర్కు ప్లాన్ వేశారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.