Purushothamudu Review: యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హాసిని సుధీర్ హీరోయిన్గా నటించింది. శ్రీ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రమేష్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాపై ఫస్ట్ నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఇందులో రాజ్ తరుణ్తో సహా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, మురళీ శర్మ వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో ఇవాళ అంటే జూలై 26న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఎన్నో ఏళ్లుగా ఫ్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్కి ఈ సినిమా కంబ్యాక్ ఇచ్చిందో లేదో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
రచిత్ రామ్ (రాజ్ తరుణ్) పుట్టుకతోనే కోటీశ్వరుడు. అతడి తండ్రి ఆదిత్య రామ్ (మురళీ శర్మ) పరశురామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ. అయితే రచిత్ రామ్ లండన్లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వస్తాడు. అదే సమయంలో రచిత్ రామ్ని సీఈఓ స్థానంలో చూడాలని అతడి తండ్రి ఆదిత్య రామ్ సహా కంపెనీ డైరెక్టర్లు అనుకుంటారు. కానీ రచిత రామ్ పెద్దమ్మ (రమ్యకృష్ణ) మాత్రం అందుకు నిరాకరిస్తుంది. ఇందులో భాగంగానే సీఈఓగా ఉండాలంటే దానికి ఒక షరతు పెడుతుంది.
ఆ పదవి దక్కాలంటే దాదాపు 100 రోజులు కామన్ మ్యాన్లా ఒక పల్లెటూల్లో బతకాలని చెబుతుంది. దాంతో రచిత్ రామ్ తనను తాను నిరూపించుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామానికి వెళ్తాడు. అక్కడ అమ్ము (హాసినీ సుధీర్) అతడికి పరిచయం అవుతుంది. అయితే అదే గ్రామంలో ఎమ్మెల్యే అండ్ అతడి కుమారుడు పూల రైతులను ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అయితే అలాంటి ఇబ్బందులను చూసిన రచిత్ రామ్ ఎలా రియాక్ట్ అవుతాడు.. గ్రామ ప్రజల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. వారికోసం ఎలా పోరాడుతాడు అనేది సినిమా చూసి తెలుసుకోవలసింది.
Also Read: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్, సూర్య నటన హైలైట్?
విశ్లేషణ:
టాలీవుడ్కు ఇలాంటి కథలు కొత్తేమి కాదు. ఒక కోటీశ్వరుడు తన ఆస్థిని అంతా వదిలి గ్రామాల్లోకి వచ్చి సేవలు చేయడం వంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఇప్పటికే చాలానే వచ్చాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ పురుషోత్తముడు కథ కూడా అలాంటిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో పాత్రను పరిచయం చేయడంలో డైరెక్టర్ స్పీడుగానే ఉన్నాడు. అయితే కొంత టైం తర్వాత స్టోరీ స్లో అవుతుంది.
అలాగే రామ్-అమ్ము మధ్య లవ్ స్టార్ట్ అయిన క్రమంలో వచ్చే కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఎప్పుడైతే ఆ ఊరు పూల రైతుల కోసం రచిత్ రామ్ పోరాడుతాడో అప్పటినుంచి స్టోరీ స్పీడందుకుంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ అలా కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో పర్వాలేదనిపించుకుంది. ఇక సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని అనుకున్నవారికి నిరాశే. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. కొంచెం బోర్ అని కూడా అనిపిస్తుంది. అలాగే విలన్ రోల్ కూడా పెద్దగా చూపించలేకపోయాడు. క్లైమాక్స్ కూడా నార్మల్గానే ఉంది.
ఎవరెలా చేశారు:
రచిత్ రామ్ పాత్రలో రాజ్ తరుణ్ అదరగొట్టేశాడు. సినిమా మొత్తం తనే కనిపిస్తాడు. రాజ్ తరుణ్ తన యాక్టింగ్తో సినిమాను భుజాలపై మోసాడు. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు అతిగా చూపించడంతో కాస్త ఓవర్గా అనిపించింది. అలాగే హీరోయిన్ హాసిని సుధీర్ అచ్చం పల్లెటూరి అమ్మాయిలా ఆకట్టుకుంది. ఇక రమ్యకృష్ణ, మురళీ శర్మలు ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు. అలాగే మూవీలో ప్రవీణ్ పాత్ర అందరినీ నవ్వులు పూయిస్తుంది. ఇక పల్లెటూరి అందాలను చక్కగా చూపించడంలో కెమెరామాన్ పీజీ విందా సక్సెస్ అయ్యారు. అలాగే దర్శకుడు రామ్ భీమన కథలో కొత్తదనం కనిపించలేదు. అంతేకాకుండా సినిమా మొత్తం ఊహించినట్లుగానే ఉంటుంది.
చివరగా చెప్పాల్సిందేటంటే.. ఇది రాజ్ తరుణ్ శ్రీమంతుడు
రేటింగ్:2.5 / 5