Paris Olympics 2024 Indian Flag Bearers PV Sindhu And Sharath Kamal: విశ్వ క్రీడలు మరో కొద్ది గంటల్లో పారిస్ లోని సెయిన్ నదిలో ప్రారంభం కానున్నాయి. ఇకపోతే తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు, సీనియర్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ భారత్ తరఫున ఫ్లాగ్ బేరర్స్గా ఎంపికయ్యారు. సింధు, శరత్ త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారతదేశ ప్రతినిధులుగా మన టీమ్ ముందు నడవనున్నారు.
ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రారంభోత్సవంలో భారత బృందాన్ని వీరిద్దరూ నడిపించనున్నారు. ఈ గౌరవం దక్కడం పట్ల సింధు సంతోషం వ్యక్తం చేసింది. ఇది ఏ క్రీడాకారులకైనా ఒకసారే వస్తుందని, ఈసారి నాకు రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఒలింపిక్స్ లో భారత పతకాన్ని పట్టుకుని నడవడం.. నిజంగా ఇదెంతో గర్వకారణమని తెలిపింది. అయితే శరత్కు ఇవి వరుసగా 5వ ఒలింపిక్స్ కాగా, సింధు మాత్రం వరుసగా మూడో సారి పాల్గొంటుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది అథ్లెట్లు
తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది అథ్లెట్లు ఈ విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఇషా సింగ్ (షూటింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు(బ్యాడ్మింటన్) బరిలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ధీరజ్ బొమ్మదేవర (ఆర్చరీ), జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి (బ్యాడ్మింటన్) పాల్గొంటున్నారు. ధీరజ్, నిఖత్ జరీన్, సింధు, సాత్విక్లపై పతక ఆశలు భారీగా ఉన్నాయి.
Also Read: ఒలింపిక్స్ లో భారత్ ప్రతికూలతలు ఇవే..
భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 11 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. భారత్లో స్పోర్ట్స్ 18, 1 ఎస్డి, 1 హెచ్డి చానెల్స్లో లైవ్ టెలికాస్ట్ కానుంది. జియో సినిమా యాప్లోనూ ఫ్రీగా చూసే అవకాశం ఉంది.
206 దేశాల నుంచి 10, 500 మంది అథ్లెట్లు, భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో ఉన్న విశ్వ క్రీడలు నేడు ప్రారంభమై ఆగస్టు 11న ముగియనున్నాయి. నేటిలాగే ఆరోజు కూడా ముగింపు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.