NTCA Data : ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యలో 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తెలిపింది. గడిచిన ఐదేళ్లలో దేశంలో పులుల మరణాలు పెరిగినట్లు నివేదికలో వివరించింది. వేట, అనారోగ్యం, వివిధ కారణాల వల్ల 628 పులులు చనిపోగా.. పులుల దాడిలో గత ఐదేళ్లలో 349 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. చనిపోయినవారిలో 200 మంది మధ్యప్రదేశ్ వాళ్లే ఉన్నట్లు తెలిపింది. 2023లో పులుల మరణాలు పెరిగినట్లు తెలిపింది.
NTCA రిపోర్ట్ ప్రకారం.. 2019లో 96 పులులు చనిపోగా.. 2023కి ఈ సంఖ్య 178కి పెరిగింది. 2012 నుంచి చూస్తే.. 2023లోనే అత్యధికంగా పులుల మరణాలు సంభవించాయి. పులుల దాడిలో 2019, 2020లో 49 మంది, 2021లో 59 మంది, 2022లో 110 మంది, 2023లో 82 మంది మరణించారని కేంద్రపర్యావరణశాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు.
ప్రస్తుతం భారతదేశంలో 3,682 పులులు ఉండగా.. ఇది ప్రపంచ అడవి పులుల సంఖ్యలో 75 శాతం అని NTCA వెల్లడించింది. దేశంలో 1973లో పులుల సంరక్షణకోసం ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించింది ప్రభుత్వం. అప్పుడు 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్ లు ఉండగా.. 78,735 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 55 టైగర్ రిజర్వ్ లను కలిగి ఉంది. మొత్తం భూభాగంలో 2.4 శాతం పులుల కోసమై కేటాయించారు.