Committee Kurrollu Trailer: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఆమె నిర్మిస్తున్న చిత్రం కమిటీ కుర్రోళ్లు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా లాంటి 14 మంది కొత్త హీరోలు తెలుగుతెరకు పరిచయమవుతున్నారు.
యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
చిన్నతనం నుంచి ఒకే ఊరిలో కలిసిమెలిసి పెరిగిన స్నేహితులు.. జాతర జరుగుతున్న సమయంలో గొడవ పడడం, దానివలన వారి కులాలు మతాలు గుర్తుచేసుకొని మరీ తిట్టుకోవడం, ఆ తరువాత వాటికి రాజకీయ రంగును అంటించి ఆ గొడవను రాజకీయం చేయడం ఇలాంటివి చూపించారు. రెండు గ్రామాల మధ్య జరిగిన జాతర ఎక్కడకు దారితీసింది. విడిపోయిన ఫ్రెండ్స్ కలిశారా.. ? అసలు కమిటీ కుర్రోళ్లు జాతర జరిపించారా.. ? అనేది కథగా తెలుస్తోంది.
చిన్న చిన్న గ్రామాల్లో జాతర సమయంలో ఉండే గొడవలనే.. ఇలా కథగా మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ పట్నం నుంచి వచ్చిన ఫ్రెండ్స్.. ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ మధ్య గొడవలు రావడం.. ఒకరు ఎక్కువ అంటే ఒకరు ఎక్కువ అని గొడవ పడడం చూపించడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందు రానుంది. మరి ఈ సినిమాతో నిహారిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చెప్పండి.