KTR gave dead line to congress government to release the Kaleswaram water
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరో పక్క బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిన్నటి బడ్జెట్ పై విమర్శల జోరు పెంచారు. స్వయంగా కేసీఆర్ అసెంబ్లీకి అడుగుపెట్టడంతో ఇక డైలాగ్ వార్ షురూ అయింది. అయితే ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు , ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి కాళేశ్వరం సందర్శించారు.రెండో రోజు శుక్రవారం కూడా కాళేశ్వరం సందర్శించిన కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచస్థాయి ప్రాజెక్టులలో ఒకటిగా చెప్పుకునేది అన్నారు.
కాళేశ్వరం గొప్పతనం ఏమి తెలుసు?
అతి తక్కువ కాలంలో అద్భుతరీతిలో రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని..గతంలో తెలంగాణలో ఇలాంటి ప్రాజెక్టులు లేక వ్యవసాయం దండగ అనే పరిస్థితి వచ్చిందని..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో చుట్టు పక్కల ప్రాంతాలు పంట సిరులతో అలరారుతున్నాయని కేటీఆర్ అన్నారు. సాగు, తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం నిర్మించామని..ఏదో ఓ చిన్న సాంకేతిక లోపం చూపించి అసలు ప్రాజెక్టే పనికిరాదని చెబుతున్నారని..ఇదంతా వాళ్ల అజ్ఝానమే అని అన్నారు.
అధికారుల మీనమేషాలు
తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుని కళకళలాడాయని అన్నారు.ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా అధికారులు మీనమేషాలు లెక్కపెడుతూ మోటార్లే ఆన్ చేయడం లేదని మండిపడ్డారు. ఇదంతా రాష్ట్రప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తోందని అన్నారు. కాళేశ్వరం లో లోపాలు ఉన్నాయని అందుకే నీటి సరఫరా ఆపేశామని చెప్పడానికే ఈ ఎత్తు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో నీళ్లు తగినంతగా లేని ప్రాజెక్టులన్నీ కాళేశ్వరం స్టోరేజ్ వాటర్ తో నింపవచ్చని అన్నారు. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేశామని అన్నారు. అలాగే సాగునీటి అవసరాల కోసం మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను ముందు చూపుతో కట్టించామని అన్నారు.
ఆగస్టు 2 న ముట్టడి
ఇప్పటికైనా కాళేశ్వరం నీటిని నీళ్లు లేక ఖాళీగా ఉన్న ప్రాజెక్టులకు మోటార్ల ద్వారా విడుదల చేయకపోతే ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోగా ప్రభుత్వానికి తమ సత్తా చూపుతామని అన్నారు. ఆగస్టు 2న కాంగ్రెస్ సర్కార్ కు డెడ్ లైన్ విధిస్తున్నామని..ఈ లోగా నీటిని ప్రాజెక్టులలోకి వదలకపోతే 50 వేల మంది రైతులతో కాళేశ్వరం వస్తామని అన్నారు. మేమే మోటార్లు ఆన్ చేసి ప్రాజెక్టులలో నీటిని నింపుతామని అన్నారు. అన్నదాతల సాగునీటి అవసరాలు తీర్చలేని ప్రభుత్వం అవకాశాలు ఉన్నా రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.