Roja Jump to Chennai After YCP Defeat In AP Elections 2024: ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా పత్తాలేకుండా పోయారు. వైసీపీ ఓటమిపాలవడంతో.. రోజా చెన్నైకి వెళ్లిపోయారు. వైసీపీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. రెండు సార్లు గెలిపించిన నగరి నియోజకర్గంలోనూ రోజా ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు.
మరోవైపు.. ఢిల్లీలో జగన్ ధర్నాకు సైతం మాజీ మంత్రి రోజా హాజరుకాలేదు. దీంతో సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండటం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రోజా రెండేళ్లపాటు ఏపీ ఐఐసీ చైర్మన్గా.. మరో రెండున్నరేళ్లపాటు టూరిజం శాఖ మంత్రిగా పదవులు అనుభవించారు.
ఇక.. అధికారంలో ఉండగా వారానికి రెండుసార్లు తిరుమల దర్శనం చేసుకున్న రోజాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రోజా వందల మందిని తిరుమల దర్శనానికి తీసుకెళ్లారని విమర్శిస్తున్నారు. వరుస ఆరోపణలతో రాజకీయాలకు రోజా దూరంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: పంచాయతీ రాజ్ శాఖపై శ్వేతపత్రం.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప్రకటన
మరోవైపు.. రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రుషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. రిషికొండపై నిర్మించిన ప్యాలెస్పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ సర్కార్ భారీగా ప్రజాధనాన్ని వృధా చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజా అక్రమ ఆస్తులు సంపాదించారని, వాటిపై విచారణ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇక.. నిత్యం చంద్రబాబు, పవన్ను విమర్శించిన రోజా.. ప్రస్తుతం సైలెంట్గా ఎందుకు ఉన్నారన్నదానిపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తనను టార్గెట్ చేస్తారన్న భయంతోనే రోజా చైన్నై వెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైలెంగ్గా ఉంటే తనను ఎవరూ పట్టించుకోరని, తాను ఎవరికి టార్గెట్ కాకూడదన్న భావనతో రాజకీయాలకు, వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు మాజీ మంత్రి రోజా.