CM Revanth Reddy latest speech(Political news in Telangana): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 31వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని వట్టినాగులపల్లిలో రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పదేళ్లుగా నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురుచూశారని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగాలు కల్పించామన్నారు.
డీఎస్పీ ద్వారా 11వేల పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని సూచించారు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే మంత్రులను కలిసి చెప్పాలన్నారు. ప్రజల ఆలోచనలు వినడమే మా ప్రజా ప్రభుత్వ విధానమని వెల్లడించారు. శిక్షణ ఉద్యోగులను ఉద్దేశించి.. 90 శాతం యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారన్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ లో దాదాపు 483 మంది శిక్షణ ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించి నియామకాలు చేపడుతున్నామన్నారు. దీంతోపాటు అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
అందరి ప్రాణాలు కాపడేందుకు అగ్ని మాపక సిబ్బంది పాత్ర చాలా కీలకమైందన్నారు. అయితే వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశ పెట్టామని సీఎం తెలిపారు. బడ్జెట్ లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని వెల్లడించారు.
Also Read: ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. బీటెక్లో మరో 9వేల సీట్లు
పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ క్షణంలో మీ తల్లిదండ్రుల గుండె ఉప్పొంగుతుందన్నారు. ఈ ఉద్యోగం జీతాల కోసం కాదని, విపత్తును జయించే సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. మీ అందరికీ అండగా ఉంటానని రేవంత్ భరోసా ఇచ్చారు. కొంతమంది యువకులు గ్రామాల్లో తల్లిదండ్రులను సరిగ్గా చూడడం లేదని మా దృష్టికి వచ్చిందన్నారు. కుటుంబాన్ని విడిచి వెళ్లవద్దని కోరారు.