Dilsukhnagar Bomb Blast Accused died(Telangana news): దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ ముక్బూల్ (52) మృతిచెందాడు. చర్లపల్లి జైలులో జీవిత ఖైదీగా ఉండగా అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు దాడుల్లో ముక్బూల్ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ముక్బూల్ కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 6 నెలల క్రితం ముక్బూల్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ డిపో ఎదురుగా 2013 ఫిబ్రవరి 21న బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు చోట్ల మూడు పేలుళ్లు సంభవించాయి.సైకిల్ మీద అమర్చిన బాంబులను కోణార్క్ థియేటర్, వెంకటాద్రి థియేటర్ మధ్యలో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో భయాందోళనకు గురిచేసింది.
సయ్యద్ మక్బూల్ స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడని ఆయనను 2013 ఫిబ్రవరి 28న అరెస్ట్ చేశారు. పాకిస్తాన్, భారత్ లోని ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదులతో అతడు క్రియాశీలకంగా సంప్రదింపులు జరుపుతూ కుట్రలో భాగమైనట్లు ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొంది. దీంతో ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది.
మక్బూల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా..ఇటీవల గుండె ఆపరేషన్ జరిగింది. అయితే తర్వాత మూత్రపిండాలు సైతం విఫలమై ఆరోగ్యం క్షీణించింది. దీంతో నిందితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో మక్బూల్ హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.
అంతకుముందు 2006లో వారణాసి, 2007 లో ముంబయి వరుస పేలుళ్లు, 2008లో జైపూర్, 2008 ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతోపాటు పలు పేలుళ్ల వెనుక మక్బూల్ పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ ప్రస్తావించింది.