Tanikella Bharani: రచయిత, నటుడు తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 800 సినిమాల పైచిలుకు చిత్రాల్లో నటించి మెప్పించిన తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం అందుకున్నారు. ఎస్ఆర్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది.
ఆగస్ట్ 3న వరంగల్లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో ఈ డాక్టరేట్ ను ఆయనకు అందివ్వనున్నారు. ఈ విషయం తెలియడంతో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తనికెళ్ల భరణి హైదరాబాద్లోని రైల్వే కాలేజీలో ఓ నాటకం వేయాల్సివచ్చినపుడు అద్దె కొంప అనే నాటకం రాసి ప్రదర్శించగా ఆ నాటకానికి మొదటి బహుమతి వచ్చింది. అలా అయన రచయితగా మారారు. ఆ తరువాత ఎన్నో మంచి నాటకాలను రాసి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక తనికెళ్ళ భరణి వ్రాసిన చల్ చల్ గుర్రం నాటకం చూసిన రామరాజు హనుమంతరావుకు, రాళ్ళపల్లి ద్వారా వంశీకి పరిచయమై కంచు కవచం చిత్రానికి రచయితగా మారారు. ఇంక అదే చిత్రంలో ఒక చిన్న పాత్రలో కూడా నటించారు. ఆ తరువాత లేడీస్ టైలర్ సినిమాలో తనికెళ్ల భరణి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఒకపక్క రచయితగా.. ఇంకోపక్క నటుడిగా కొనసాగుతూ వస్తున్నారు.
ఇక ఆయనకు అవార్డులకు కొదువేం లేదు. సముద్రం సినిమాకు ఉత్తమ విలన్గా, నువ్వు నేను సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ నటునిగా, గ్రహణంతో ఉత్తమ నటునిగా, మిథునం సినిమాకు గాను ఉత్తమ రచయిత.. ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.