Minister Konda Surekha: ఐఏఎస్ అధికారణి, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రెటరీ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు కూడా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారు మరింత జాగ్రత్త వహించాలని చెప్పారు.
దివ్యాంగులపై స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఒక ఉన్నత స్థానంలో ఉండి, పర్యవసానాలను ఆలోచించకుండా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. తమ మాటల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళ్లుతుందో దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచనలు చేశారు.
శారీరక సామర్థ్యం కంటే మానసిక సామర్థ్యమే ముఖ్యమని స్మితా సభర్వాల్ గుర్తించాలని మంత్రి కొండా సురేఖ హితవు పలికారు. గొప్ప సంకల్ప బలంతో శారీరక దుర్భలత్వాన్ని జయించి ఈ ప్రపంచానికి స్ఫూర్తి ప్రధాతలుగా నిలిచిన మహోన్నత వ్యక్తులు ఎందరో ఉన్నారని ఆమె గుర్తించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో వివక్షకు తావులేదని, అన్ని వర్గాల హక్కులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: మాదాపూర్లో రేవ్ పార్టీ.. 15 మంది అరెస్టు
ఐఏఎస్ ఎంపికలో వికలాంగుల రిజర్వేషన్ ఎందుకు? అంటూ స్మితా సభర్వాల్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. బాల లత తీవ్రంగా స్పందించారు. తనతో పోటీ పడాలని, ఇప్పుడు పరీక్ష రాస్తే స్మితా సభర్వాల్ కంటే తనకే ఎక్కువ మార్కులు వస్తాయని అన్నారు. వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనా స్మితా సభర్వాల్ రియాక్ట్ కావడం గమనార్హం.