Parliament Session: హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పార్లమెంటులో తన తొలి ప్రసంగాన్ని ఇచ్చారు. ఎప్పుడూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ దుమారాన్ని రేపే కంగనా రనౌత్ తొలి ప్రసంగంలో ఏమి మాట్లాడారా? అనే ఆసక్తి సహజంగానే ఏర్పడుతుంది. తన తొలి ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో అంతరించిపోయే దశలో ఉన్న గిరిజన సంగీతం, జానపద కళల గురించి ఆమె వివరించారు.
పార్లమెంటులో మండి ప్రజల గొంతును వినిపించే అవకాశాన్ని తనకు కల్పించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. హిందీలో ఆమె మాట్లాడుతూ.. ‘మండిలో అనేక రకాల కళలు అంతరించిపోయే దశకు చేరాయి. మా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన నిర్మాణ విధానం ఉన్నది. దాన్ని కత్ కుని అంటారు. ఇది కూడా అంతరించిపోయేలా ఉన్నది. గొర్రె ఉన్నితో అనేక రకాల జాకెట్లు, క్యాపులు, శాలువాలు, స్వెటర్లను తయారు చేస్తారు. ఇలాంటి వాటిని విదేశాల్లో చాలా విలువైనవిగా పరిగణిస్తారు. కానీ, ఇక్కడ ఆ పద్ధతులు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. వీటిని పునరుజ్జీవం గావించడానికి, ప్రమోట్ చేయడానికి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో వాటిపై మాట్లాడాలని కోరుకుంటున్నాను’ అని కంగనా రనౌత్ తెలిపారు.
Also Read: కేసీఆర్ చీల్చి చెండాడితే మేం చూస్తూ ఊరుకోం: మంత్రి పొన్నం
‘అలాగే, హిమాచల్ ప్రదేశ్ జానపద కళ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించదలిచాను. ముఖ్యంగా స్పితి, కిన్నౌర్, భర్మోర్ సహా పలు గిరిజన సంగీత కళారూపాలు అంతరించేపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటిని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం’ అని ఆమె అడిగారు.
ఇందుకు సంబంధిచిన వీడియోను కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తూ ఓ క్యాప్షన్ పెట్టారు. నేడు పార్లమెంటులో మండి ప్రజలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించే అవకాశం దక్కింది అంటూ పేర్కొని ఈ వీడియోను పోస్టు చేశారు.