Boat Capsized: ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన ఆఫ్రికాలో జరిగింది. ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆఫ్రికాలోని మారిటానియా సముద్ర తీరంలో యూరప్ దిశగా వెళ్తున్న బోటు బోల్తాపడింది. దీంతో బోటులో ప్రయాణిస్తున్న 15 మంది మృతిచెందారు. మరో 150 మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఐఓఎం తెలిపింది. ప్రమాద సమయంలో బోట్లో 300 మంది వలసదారులు ఉన్నారని, మారిటానియా రాజదాని నాఖ్కోట్ సమీపంలో ప్రమాదవశాత్తు బోల్తా పడినట్లు పేర్కొన్నది. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే కోస్టు గార్డు సిబ్బంది 120 మందిని రక్షించారని, దురదృష్టవశాత్తు 15 మంది మృతిచెందారని ఐఓఎం వెల్లడించింది.
కాగా, పశ్చిమ ఆఫ్రికాకు చెందిన వేలాదిమంది స్పెయిన్ కానరీ దీవులకు వలస వెళ్తున్నారు. ఇందుకోసం చిన్న చిన్న చేపల బూట్ల ద్వారా అట్లాంటిక్ సముద్రంలో సెనెగల్ మార్గంలో ప్రయాణించి.. మారిటానియాకు చేరుకుంటున్నారు. అటు నుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి కానరీ దీవులకు చేరుకుంటున్నారు. దగ్గరి మార్గంతోపాటు, ప్రయాణ ఖర్చులు తక్కువగా ఉంటాయన్న కారణంతో ప్రమాదకరమని తెలిసినా కూడా ఎక్కువమంది ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
Also Read: ఆమెకు అమెరికాను పాలించే అర్హత లేదు: ట్రంప్
అయితే, పేదరికం, ఆయా ప్రాంతాల్లో అస్థిరత కారణంగా ఆఫ్రికన్ ప్రజలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడ పరిస్థితులు అధ్వానంగా ఉండడంతో తల్లిదండ్రులే తమ పిల్లలను బలవంతంగా యూరప్ దేశాలకు పంపిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 20 వేల వరకు ఈ ద్వీపాలకు వలస వెళ్లినట్లు ఐఓఎం వెల్లడించింది.