Minister Seethakka: మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శలు సంధించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ తీరును ఆమె తూర్పారబట్టారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, దీనిపై తాము కేంద్ర ప్రభుత్వంతో పోరాడటానికి కూడా సిద్ధమవుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అలాంటిది.. తెలంగాణకు కేటాయింపులు జరపని కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదని సీతక్క నిలదీశారు. కేంద్ర బడ్జెట్ను వదిలేసి రాష్ట్ర బడ్జెట్ పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
Also Read: సముద్రాన్ని ఈదిన సిరియా శరణార్థి యుస్రా మర్దిని.. పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటుతుందా?
తీర్మానం ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి రాకుండా ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వచ్చారో? వచ్చి రాష్ట్ర బడ్జెట్ పై విమర్శలు ఎందుకు చేస్తున్నారో అందరికీ అర్థమవుతూనే ఉన్నదన్నారు. బీజేపీ మెప్పుకోసమే రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రావడమే ఇందుకు నిదర్శనం అని చెప్పారు.
కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విరుచుకుపడ్డారు. ఎన్నడూలేనిది కేసీఆర్ మీడియా పాయింట్ వద్దకు వచ్చారని, త్వరలోనే ఆయన బోను ఎక్కుతారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కామెంట్ చేశారు. ఊహల్లో బతికిన కేసీఆర్.. ఇంకా తానే రాజునని భావిస్తున్నట్టున్నారని విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలను వంచించిందని, ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని కేసీఆర్ విమర్శలు చేశారు. గొర్రెల పంపకం పథకం లేదని అర్థమవుతున్నదని, దళిత బంధు ప్రస్తావన లేదని, మత్స్యకారులకు భరోసా లేదని వివరించారు. ఒక్క పాలసీ కూడా ఫార్మూలేషన్ కాలేదని బడ్జెట్ చూస్తే అర్థమవుతున్నదని పేర్కొన్నారు. రైతులను, వృత్తికార్మికులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.