Yusra Mardini: నిత్యం ఏదో యుద్ధంతో తునాతునకలయ్యే సిరియా దేశంలో జన్మించిన యుస్రా మర్దిని పారిస్ ఒలింపిక్స్లో శరణార్థుల టీమ్ నుంచి పాల్గొంటున్నారు. యుద్ధ బీభత్సం నుంచి తప్పించుకోవడానికి 17 ఏళ్ల వయసులో సముద్రాన్ని ఈది చివరికి జర్మనీకి చేరుకున్నారు ఆమె. శరణార్థి క్రీడాకారులను కూడా గౌరవిస్తున్న ఒలింపిక్ గేమ్స్ ఒలింపిక్ శరణార్థి టీమ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టీమ్లో భాగంగానే యుస్రా మర్దిని 2016, 2020లలో ఒలింపిక్ గేమ్స్లో పాల్గొన్నారు.
అంతర్యుద్ధంతో అట్టుడికే సిరియా దేశంలో యుస్రా మర్దిని 1999లో జన్మించారు. ఐఎస్ఐఎస్ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు సిరియా దేశమంతా రణరంగంగా మారింది. ఆ సమయంలో ఆమె తన సోదరితో కలిసి ఇల్లు వీడాల్సి వచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శరణార్థులుగా వారు చేసిన ప్రయాణం పెనుసవాళ్లతో సాగింది. ముందుగా వారు సిరియా నుంచి లెబనాన్కు, అక్కడి నుంచి టర్కీకి విమానంలో వెళ్లారు. ఆ తర్వాత గ్రీస్కు పడవలో బయల్దేరారు.
10 కిలోమీటర్లు ప్రయాణిస్తే వారు గ్రీస్ దేశానికి చేరుకుంటారు. 45 నిమిషాల ఈ ప్రయాణంలో పడవ ప్రయాణం ప్రారంభించిన 20 నిమిషాలకే బ్యాలెన్స్ కోల్పోయింది. పరిమితికి మించి శరణార్థులు పడవ ఎక్కడంతో ఎప్పుడు మునిగిపోతుందో తెలియని స్థితికి చేరుకుంది. ఆ సమయంలో కొందరిని పడవ నుంచి సముద్రంలోనే దింపేశారు. అందులో యుస్రా మర్దిని కూడా ఒకరు. చుట్టూ సముద్రమే. కనిపించని దరి కోసం ఆమె ధైర్యంగా ఈదుతూ ప్రయాణాన్ని ప్రారంభించారు. సుమారు మూడు గంటలపాటు ఈత కొట్టిన తర్వాత తీరాన్ని చేరుకుంది.
Also Read: Paris Olympics : ఒలింపిక్స్ నుంచి ఈసారి మెడల్స్ తెచ్చేదెవరు .. ?
ఆమె చివరిగా జర్మనీ చేరుకుంది. ఈ ప్రయాణం కూడా అంత సులువుగా ఏమీ సాగలేదు. కొన్ని సార్లు కాలి నడక, బస్సు ప్రయాణం, మరికొన్ని సార్లు స్మగ్లర్ల సహకారం కూడా తీసుకోవాల్సి వచ్చింది. రియో ఒలింపిక్ 2016 కోసం తొలిసారి శరణార్థి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వేశారు. కమిటీ శరణార్థి ఒలింపిక్ టీమ్ను ఏర్పాటు చేసింది. ఇందులో చోటుకోసం జర్మనీ చేరుకున్నాక ఏడాది లోపే ఆమె పోటీ పడ్డారు. శరణార్థి టీమ్లో భాగంగా ఆమె రియో ఒలింపిక్ లో స్విమ్మింగ్ చేశారు. 100 మీటర్ల బటర్ఫ్లై హీట్లో ఆమె విజయం సాధించకున్నా.. ఆమె పోటీ పడటం అక్కడి మెడల్ పోడియాన్ని భావేద్వాగానికి గురి చేసింది. తాను కేవలం ఒలింపిక్ జెండాను పట్టుకోలేదని, అంతర్జాతీయ సమాజపు ఆశలను పట్టుకుని ముందుకు సాగుతున్నానని యుస్రా మర్దిని చెప్పారు.
ఆమె శరణార్థుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ఐరాస మానవ హక్కుల గుడ్ విల్ అంబాసిడర్గా పిన్న వయసులోనే ఎంపికయ్యారు. ఇటీవలే ది స్విమ్మర్స్ పేరిట ఆమె పై ఓ బయోపిక్ కూడా వచ్చింది. టైమ్ మ్యాగజిన్ 100 అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటుసంపాదించుకున్నారు. దీంతో ఆమె పేరు అంతర్జాతీయంగా మారుమోగుతున్నది. 2016లో రిఫ్యూజీ టీమ్ల పది మంది క్రీడాకారులుంటే నేటి పారిస్ ఒలింపిక్లో ఈ టీమ్లో భాగంగా 37 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.