Harish Rao Comments on Telangana Budget: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024పై మాజీ ఆర్థిక మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బడ్జెట్ లో గ్యారెంటీ హామీల ప్రస్తావనే లేదు. రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగుల నియామకాలు ప్రస్తావనే లేదు. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా అన్నారు.. ఆ ప్రస్తావన లేనేలేదు. చేనేత కార్మికులకు ఊరట కలిగించేలా బడ్జెట్లో కేటాయింపులే లేవు. బడ్జెట్ అన్ని వర్గాలనూ నిరాశ పరిచింది. ఎన్నికల్లో గ్యారెంటీ గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ. అత్యంత పేదలను, వితంతువులను, ఒంటరి మహిళలను ప్రభుత్వం మరిచిపోయింది.
చేనేత కార్మికులకు ఊరట కలిగించేలా బడ్జెట్లో కేటాయింపులే లేవు. బడ్టెట్లో గ్యారెంటీ హామీల ప్రస్తావన లేదు. ఆటో కార్మికుల సమస్యలు, వారికిస్తామన్న ఆర్థిక సాయం ప్రస్తావనే లేదు. హైదరాబాద్ అభివృద్ధిని మేం నిర్లక్ష్యం చేశామని చెప్పడం పెద్ద జోక్. చంద్రబాబు, రజినీకాంత్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారు. నీతి ఆయోగ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును కొనియాడింది.
తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చాం’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.
Also Read: కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? : బండి సంజయ్
‘మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి.. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అలా లేదు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినా మహిళలకు ఆర్థిక సాయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కోటి మంది మహిళలు నెలకు రూ. 2500 సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పెన్షన్లు రూ. 4 వేలకు పెంచుతామని చెప్పి.. ఇప్పటికీ పెంచలేదు. ఈ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇలా అందరినీ మోసం చేసింది’ అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు.