Bandi Sanjay Comments on Telangana Budget: రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?. గాడిద గుడ్డు పెట్టం ఎంత నిజమో.. కాంగ్రెస్ హామీల అమలు అంతే నిజమనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం. భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్టా..? లేక అప్పుల పత్రమా? అప్పులున్నందున హామీలు అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? ఆరు గ్యారంటీలకు బడ్జెట్ లో నిధులెందుకు కేటాయించలేదు. ఆరు గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా కేంద్రాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారా? కేటాయింపులకు సరిపడా ఆదాయం ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తారో బడ్జెట్ లో చూపకపోవడం విడ్డూరం. రూ. లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా కేటాయించని కాంగ్రెస్ నేతలా కేంద్రంపై విమర్శలు చేసేది? హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ కు మాటలు ఎక్కువని బడ్జెట్ చూస్తే అర్థమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడతారా?’ అంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అయితే, బీహార్, ఏపీ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాల నుంచి ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఎన్డీయే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాదిరిగా వివక్ష చూపడం సరికాదంటూ దుయ్యబట్టారు. కేవలం ఈ రెండు రాష్ట్రాలకే కాదు.. కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు.
ఇటు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖండించారు. ప్రెస్ మీటి పెట్టి కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారు. ఏపీ పునర్వీభజన చట్టం ప్రకారం ఏపీకి అధిక నిధులు కేటాయించినప్పుడు తెలంగాణకు ఎందుకు కేటాయించరని ప్రశ్నించారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఐఐఎం ఉన్నప్పుడు తెలంగాణకు మాత్రమే ఇయ్యబోమంటూ లేఖ ఎలా రాస్తారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడే కాదు.. ఆది నుంచి కూడా మోదీ తెలంగాణ వివక్ష చూపుతున్నారన్నారు.
Also Read: అన్నదాతలకు సున్నం.. మహాలక్ష్ములకు మహామోసం: కేటీఆర్
మరో విషయమేమంటే.. తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. నగర వ్యాప్తంగా పలు చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేసింది. తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లను ఇస్తే బీజేపీ తెలంగాణకు రిటర్న్ గిఫ్ట్గా గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ఆ బ్యానర్లలో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ రాష్ట్ర బడ్జెట్ పై ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.