Kannada Actor Darshan: తన అభిమాని హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప భార్య విజయలక్ష్మి దర్శన్ బుధవారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ను బెంగుళూరులోని ఆయన నివాసంలో కలిశారు. విజయలక్ష్మితో పాటు దర్శన్ సోదరుడు దినకర్ తూగుదీప, ప్రేమ్ సినిమా దర్శకుడు కూడా ఉపముఖ్యమంత్రిని కలిశారు. ఈ మీటింట్ తరువాత డికె శివకుమార్.. విలేకరులతో మాట్లాడారు.
”దర్శన్ కుటుంబం నాతో మీటింగ్ కోసం రెండు రోజుల క్రితం ఒక కార్యక్రమంలో కలిశారు. కానీ నేను వారిని నా ఇంటికి రమ్మని చెప్పాను. ఈ మీటింగ్ దర్శన్ కేసు గురించి కాదు. దర్శన్ కుమారుడు 15 ఏళ్ల వినీష్ నా స్కూల్లో చదివేవాడు.. కానీ నెల రోజుల క్రితం వేరే స్కూల్లోకి అడ్మిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు తిరిగి నా స్కూల్లోనే చేరేందుకు ప్రయత్నిస్తే.. అడ్మిషన్ ఇవ్వలేదు. ఈ విషయంలో నన్ను కలవడానికి వారంతా వచ్చారు. నేను వారిని స్కూల్ ప్రిన్సిపాల్ ని కలవండి అని సూచించాను.” అని అన్నారు.
హత్య కేసులో నటుడు దర్శన్ కు అన్యాయం జరుగుతోందని మీరు భావిస్తున్నారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ”ఇప్పటికే మీడియాలో ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తున్నారు. నేను ఈ కేసులో కచ్చితంగా ఏ విషయం అనేది చెప్పలేను. నేను రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ని కాను. ఈ కేసులో కలుగజేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు.” అని చెప్పారు.
Also Read: ‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం!
దర్శన్ భార్య కోరితే మీరు సహాయం చేస్తారా? అని విలేకరి మరో ప్రశ్న అడిగారు. దానికి ఆయన.. ”నా నియోజకవర్గంలో ఒక మహిళకు అన్యాయం జరిగిందని నా వద్దకు వస్తే.. కచ్చితంగా నాకు తూచిన సహా చేస్తా.. కానీ హత్య కేసులో పోలీసుల విచారణ సాగుతోంది. కోర్టులో కేసు పెండింగ్ ఉంది. విచారణ జరుగుతుండగా.. మధ్యలో నేను ఏమి చేయలేను. అయినా ఆమె వచ్చింది.. తన కొడుకు స్కూల్ అడ్మిషన్ కోసం అని చెప్పాను కదా,” అని సమాధానం ఇచ్చారు.
కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. దర్శన్ ప్రియురాలిని.. రేణుకా స్వామి అసభ్య మెసేజ్ లు చేసి బెదిరించేవాడని.. అందుకే దర్శన్, తన అభిమాన సంఘం నాయకులతో కలిసి రేణుకా స్వామిని చిత్రహింసలు పెట్టి.. అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్శన్ తో పాటు ఆయన ప్రియురాలు.. మరో అయిదుగురు జైల్లో ఉన్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.
Also Read: యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు