Tax clearance certificate mandatory for leaving India
విదేశాలకు భారత్ నుంచి వీసా, పాస్ పోర్ట్ ఉంటే చాలదు. ఇకపై ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకుంటేనే వారికి అనుమతిస్తారు. ఇప్పటిదాకా నామమాత్రంగా ఉన్న ఈ నిబంధనను ఇకపై కఠినతరం చేసేందుకు మొన్నటి కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదన తీసుకొచ్చారు. అక్టోబర్ 1 నుండి ఈ నిబంధనను ఇకపై కఠినంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది భారత ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖ. భారతదేశంలో లెక్కలలో చూపని బ్లాక్ మనీని కొందరు విదేశాలకు తరలించి దానిని వైట్ గా మార్చుకుంటూ ప్రభుత్వా ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇకపై అలాంటి వారి ఆటలు సాగవు. అక్టోబర్ 1 నుంచి అమలు చేసే కఠిన నిబంధపలతో బ్లాక్ మనీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తనున్నాయి. భారతదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లాలనుకునే వారు సంబంధిత అధికారుల వద్ద నుంచి ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్ పోర్ట్ లో సబ్ మిట్ చేస్తేనే వారిని ప్రయాణానికి అనుమతిస్తారు. ఒక వేళ బకాయిలు ఉంటే వాటిని క్లియర్ చేసుకోవాలి. అప్పుడే వారికి పూర్తి స్థాయి అనుమతులు లభిస్తాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు .
ఆర్థిక నేరగాళ్ల ఆటలు సాగవు
విదేశాలలో ఎక్కెడెక్కడ ఆస్తులు ఉన్నాయో కూడా అధికారులకు సమర్పించాలని, ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే వారిపై కఠినచర్యలుంటాయని చెబుతున్నారు. ఇకపై గతంలో మాదిరిగా విదేశాలకు చెక్కేద్దాం అనుకుంటే కుదరుదు. గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం విదేశాలలో మూలుగుతున్న బ్లాక్ మనీని వెనక్కి రప్పిస్తామని సందర్భం దొరికినప్పుడల్లా ఊదరగొట్టారు. దానిపై ప్రతిపక్షాలతో సహా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే ప్రతిపక్షాల విమర్శలకు జవాబు చెప్పేందుకు మోదీ సర్కార్ ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆర్థిక నేరగాళ్లు భారతదేశంలోని బ్యాంకులలో కోట్లాది అప్పులు తీసుకుని విదేశాలకు చెక్కేస్తున్నారు. అలా విదేశాలకు వెళ్లిపోయి అక్కడి చట్టాలను ఆసరా చేసుకుని జల్సాలు చేస్తున్న విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లకు ఇకపై ముకుతాడు పడనుంది.