Pawan Kalyan Speech in Assembly: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ శ్వేతపత్రంపై ఆయన మాట్లాడారు. ఎక్సైజ్ శాఖలో శ్వేతపత్రంలో చెప్పినదాని కంటే ఎక్కువగానే అక్రమాలు జరిగాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాకు కేవలం ఈ శాఖ వల్ల రూ. 18 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కారకాలను కచ్చితంగా శిక్షించాలన్నారు. తప్పు చేసినవారిని వదిలేస్తే ప్రజాప్రతినిధులకు మాట్లాడే నైతిక హక్కు ఉండబోదన్నారు.
Also Read: ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అమరావతికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తే చాలా సంతోషించాను. అదే ఎక్సైజ్ శాఖ నుంచి ఖజానాకు రావాల్సిన రూ. 18 వేల కోట్లు వచ్చి ఉంటే పోలవరం పూర్తి అయ్యేది. రూ. 20 వేలు లంచం తీసుకున్న ఓ సాధారణ ఎంప్లాయిస్ ను శిక్షించగలగుతున్నాం. అలాంటిది.. ఇంత భారీ మొత్తంలో దోపిడీకి పాల్పడినవారిని వదిలిపెడితే ఎలా..? ఎట్టి పరిస్థితుల్లో వారిని వదలకూడదు. రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా..? అనే ఆలోచనను సామాన్యుడికి కలగకుండా చేయాలి. మద్యం వ్యసనం తగ్గించేలా డి-అడిక్షన్ సెంటర్లకు బడ్జెట్ కేటాయించాలి’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.