Musk sets up bedrooms in Twitter office : పూటకో సంచలన నిర్ణయంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటున్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్… ఇప్పుడు మరో డెసిషన్ తీసుకున్నాడు. ఉద్యోగుల కోసం ట్విట్టర్ ఆఫీసులోనే బెడ్ రూమ్ పాడ్స్ ఏర్పాటు చేశాడు. అయితే, ట్విట్టర్ ఆఫీస్ను ఇలా ఎందుకు మార్చారనేది మాత్రం మస్క్ ఇంకా బయటపెట్టలేదు.
శాన్ఫ్రాన్సిస్కోలోని మార్కెట్ స్ట్రీట్ 900లో ఉన్న 7 అంతస్తుల ప్రధాన కార్యాలయం నుంచి ట్విట్టర్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇదే ఆఫీస్లో ఉద్యోగుల కోసం ఒక్కో ఫ్లోర్లో 4 నుంచి 8 బెడ్ రూమ్ పాడ్స్ను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల కోసం గదుల్ని చిన్న చిన్న సైజుల్లోకి మార్చి… బెడ్స్, కర్టన్లు, టెలిప్రెసెన్స్ మానిటర్స్తో కాన్ఫరెన్స్ రూమ్ తరహాలో డిజైన్ చేసినట్లు ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. సంస్థ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగులు ఆఫీసులోనే నిద్ర పోయేలా ఏర్పాట్లు చేశారని తెలిపింది.
కొద్దిరోజుల కిందట ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసిన మస్క్… సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఉద్యోగులు నిద్రాహారాలు మానేసి పని చేయాలని కోరారు. ఉద్యోగుల నుంచి మెయిల్ రూపంలో హామీ కూడా తీసుకున్నారు. హార్డ్ కోర్ ఉద్యోగులైతే తన మెయిల్కు ఎస్ అని మాత్రమే రిప్లై ఇచ్చేలా ఆప్షన్ ఇచ్చారు. అందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు రోజుకు 12గంటలు పని చేయాలని, లేకపోతే సంస్థ దివాలా తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. రిప్లై ఇవ్వని ఉద్యోగులు మూడు నెలల నోటీస్ పీరియడ్తో సంస్థను వదిలి వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత… ట్విట్టర్ ఆఫీస్లోనే మస్క్ బెడ్రూమ్లు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. వర్క్ విషయంలో ఉద్యోగుల మెడపై కత్తిపెట్టి మరీ పని చేయించుకుంటున్న మస్క్… ఇప్పుడు ఏకంగా ఆఫీస్లోనే బెడ్రూమ్లు ఏర్పాటు చేశాడంటే… ఏదో బలమైన కారణమై ఉండి ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన ఏ ప్రకటన చేస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.