CM Chandrababu Review meeting: ఏపీలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఆ దిశగా పని చేయాలంటూ మంత్రులు, హెచ్ఓడీలు, కార్యదర్శులకు సీఎం చంద్రబాబు తాజాగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దుర్భరమైన పేదరికంలో ఉన్నారంటూ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. వారందరినీ ఆ పేదరికం నుంచి బయటపడేసే విధంగా 4పిని అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు రాబట్టే అంశాలకు సంబంధించి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సమీక్షలన్నీ కూడా నిర్దేశిత సమయంలోగానే పూర్తయ్యే విధంగా చూడాలంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసేందుకు వినూత్న ఆలోచనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై దృష్టిపెట్టాలన్నారు.
Also Read: ఇండియా కూటమిలోకి వైసీపీ? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు?
కేంద్రం నుంచి తెచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని సూచించారు. మూసధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచనలు చేయాలన్నారు. పరిపాలన విషయంలో అధికారులకు తన వైపు నుంచి వంద శాతం మద్దతు ఉంటుందంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. విధి నిర్వహణలై నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా ఉంటానన్నారు. గంటల తరబడి సమీక్షలకు తాను స్వస్తి పలికానన్నారు. అధికారులు కూడా రిజల్ట్ ఒరియేంటెడ్ పద్ధతిన సమీక్షలు నిర్వహించాలని వారికి సూచించారు.