Chang’e-5 Mission: భారత్ సహా అన్ని ప్రపంచ దేశాలు చంద్రుడి అన్వేషణకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే చాంగే-5 సాయంతో జాబిల్లిపై నుంచి భూమిపైకి మట్టి నమూనాలను తీసుకువచ్చిన చైనా వాటిపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ మట్టి ఆధారంగానే చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్లు పేర్కొంది. తమ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించినట్లు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.
చంద్రుడిపై మట్టి నమూనాల సేకరణ లక్ష్యంగా 2020లో చైనా చేపట్టిన చాంగే-5 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రుడి ఉపరితలం నుంచి దాదాపు 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తీసుకువచ్చింది. అనతంరం వాటిపై బీజింగ్ నేషనల్ లేబరేటరీ ఫర్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ , సీఏఎస్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఆ నమూనాల్లోనే నీటి అణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని సీఏఎస్ ఇటీవల పేర్కొంది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని ఓ జర్నల్లో ప్రచురించినట్లు వెల్లడించింది.
Also Read:మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ టాప్లో సింగపూర్, మరి ఇండియా ?
చంద్రుడిపై పరిశోధనలో భాగంగా అమెరికాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు 40 ఏళ్ల క్రితమే చంద్రుడిపైకి వెళ్లి మట్టి నమూనాలను సేకరించారు. అనంతరం సోవియట్ యూనియన్ కూడా 1976లో చంద్రుడి మట్టి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఈ రెండు దేశాల తర్వాత జాబిల్లి నుంచి మట్టి సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది. అయితే 2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక కూడా చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.