YS Jagan: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల దారుణ హత్యలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఆరోపిస్తూ ఢిల్లీలో ఆందోళనకు దిగింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని, కాబట్టి, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని సీఎం జగన్ ఇది వరకే డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ హింసను ఖండించాలని, తమ పార్టీకి అండగా నిలవాలన్న పిలుపు మేరకు ఇండియా కూటమిలోని పలు పార్టీలు వైసీపీకి సంఘీభావం తెలిపాయి. జంతర్ మంతర్ వద్దకు వచ్చి వైఎస్ జగన్ వెంట నిలబడ్డాయి. సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ), టీఎంసీతోపాటు ఏ కూటమిలోనూ లేని ఏఐఏడీఎంకే కూడా వైసీపికి మద్దతు ప్రకటించాయి. ఏపీలో జరిగిన హింసకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జంతర్ మంతర్ వద్ద వైసీపీ ప్రదర్శించింది.
వైసీపీకి కాంగ్రెస్ కూటమి నుంచి విశేష ఆదరణ లభించడంతో వైఎస్ జగన్ పార్టీ ఇండియా కూటమిలో చేరుతున్నదా? అనే చర్చ జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సఖ్యంగా వ్యవహరించిన వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. అదే బీజేపీతో జత కట్టిన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జగన్ పార్టీ కాంగ్రెస్ కూటమి వైపు మరలుతున్నదనే వాదనలకు బలం లభించింది. ఈ చర్చ పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందా? అనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
వైసీపీ బలమైన పార్టీ అని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్గా బరిలోకి దిగగా 40 శాతం ఓట్లు తమకు పడ్డాయని సజ్జల వివరించారు. ఎన్నికల్లో ఓట్లు ప్రధాన లక్ష్యంగా పొత్తు పెట్టుకోవద్దనేది జగన్ సిద్ధాంతం అని, గత 12 ఏళ్లుగా వైసీపీ ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నదని ఇప్పటికీ అదే పాటిస్తుందని తెలిపారు. ఇండియా కూటమిలో చేరడం లేదని పేర్కొన్నారు.
పొలిటికల్ వాయిలెన్స్ అనేది అన్ని పార్టీలకు సంబంధించినదని, అన్ని పార్టీలు ఏదో ఒక రూపంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని, అందుకే తమ పార్టీకి సంఘీభావంగా ముందుకు వచ్చాయని సజ్జల తెలిపారు. ఆ పార్టీలకు సమస్య ఉన్నా తమ పార్టీ అండగా వెళ్లుతుందని చెప్పారు. రాజకీయ హింసను ఖండించాలని అన్ని పార్టీలను ఆహ్వానించామని, అందులో బీజేపీ, కాంగ్రెస్లు కూడా ఉన్నాయని, కానీ, వీలైన పార్టీలు మాత్రమే ఇక్కడికి వచ్చాయని పేర్కొన్నారు.
Also Read: సల్మాన్ ఖాన్ను చంపడానికి రూ. 25 లక్షల సుపారీ.. ‘ఆ గ్యాంగ్స్టర్ పనే’
రాష్ట్రంలో జరుగుతున్న హింసను ఇతర పార్టీలకు వివరించాలని, జాతీయ మీడియాలోనూ ఈ విషయం చర్చ జరగాలని, అలాగే.. రాష్ట్రపతి పాలన విధించాల్సినంత అరాచక పరిస్థితులు ఏపీలో ఉన్నాయని చెప్పడానికి ఇక్కడికి వచ్చామని సజ్జల తెలిపారు. తాము ఆశించింది పూర్తిస్థాయిలో విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ నిరసనతో తాము ఆశించేది రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనడమేనని వివరించారు. ఇది మంచి సంప్రదాయం కాదని, ఇదిలాగే కొనసాగితే భవిష్యత్లో హింసను కట్టడి చేయలేని పరిస్థితులూ ఏర్పడే ముప్పు ఉంటుందని తెలిపారు.