Vibrant Villages Programme: భారత్-చైనా సరిహద్దు గ్రామాల అభివృద్దిపై కేంద్రం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే చైనాతో సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్లలోని వందల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం తాజా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
దేశ రక్షణలో సరిహద్దు గ్రామాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే చొరబాట్లు, అక్రమ రవాణాకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామాలపై దృష్టి సారించింది. చైనాతో సరిహద్దును కలిగి ఉన్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, లద్దాఖ్లలోని వందల గ్రామాల్లో అభివృద్ధి కోసం తాజా బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది.
సరిహద్దు గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పేరుతో ఫిబ్రవరి 23, 2023 న కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, తద్వారా వలసలను తగ్గిచేందుకు కేంద్ర హోం శాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా 2022- 23 , 2025-26 మధ్యకాలంలో దాదాపు రూ. 4800 కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా బడ్జెట్ రూ. 1050 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ తెలిపారు.