Indra Re Release: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఇంద్ర ఒకటి. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించాడు. 2002 జూలై 24 న రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
268 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లోనే.. రూ.50 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఇక ఇంద్ర రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తికావడంతో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇంద్ర గురించిన పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మొదట ఇంద్ర సినిమాను తెరకెక్కించనని బి. గోపాల్ మంకు పట్టు పట్టారట. దానికి కారణం. అప్పటికే చిరుకు ఆయన మెకానిక్ అల్లుడు సినిమాతో ప్లాప్ ఇవ్వడం ఒకటి అయితే.. ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు చేయడం వలన ఇదికూడా అలాంటి కథే అని తెలిసేసరికి చేయను అన్నాడట. అయితే పరుచూరి గోపాలకృష్ణ పూనుకొని.. బి. గోపాల్ ను ఒప్పించారట. అలా ఇంద్ర మొదలయ్యింది.
చిన్నికృష్ణ ఇంద్ర కథను సిద్ధం చేసినప్పుడు కృష్ణ- గోదావరి నదీ ప్రాంతాలు అనుకున్నారట. ఆ తరువాత ఎన్నో చర్చల తరువాత కాశీ- గంగానది ఫిక్స్ అయ్యిందట. అంతేకాదు.. మొదట ఒక హీరోయిన్ గా సిమ్రాన్ ను తీసుకోవాలని ప్లాన్ చేసిన మేకర్స్.. కొన్ని కారణాల వలన ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రేను తీసుకున్నారట. అప్పట్లో 175 రోజులు ఆడిన సినిమాగా ఇంద్రకు ఒక రికార్డ్ ఉంది.
ఇక వైజయంతీ మూవీస్ లో చిరు మూడో సినిమా ఇది. అప్పటికే జగదేకవీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది లాంటి హిట్ సినిమాలు చేశాడు చిరు. అందుకే వీరి కాంబో అంటే ప్రేక్షకులకు అంతులేని అభిమానం. ఈ సినిమా హిందీలో ఇంద్ర- ది టైగర్, బెంగాలీలో సుల్తాన్ అనే పేరుతో రీమేక్ అయ్యింది. మరి ఇంద్ర రిలీజ్ కే మెగా ఫ్యాన్స్ అంత హడావిడి చేస్తే.. రీరిలీజ్ కు ఏ రేంజ్ హడావిడి చేస్తారో చూడాలి.