BRS MLAs and MLCs to visit Kaleshwaram: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అధికార పక్షం నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై చర్చిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావులు మాట్లాడుతూ.. బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని తాము కూడా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయమై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలన్నారు. మంత్రులు ఢిల్లీకి వెళ్లి దీక్ష చేస్తే తాము కూడా మద్దతిస్తామన్నారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పకుండా పోరాడుతామన్నారు. ఢిల్లీలో దీక్ష చేస్తాం కానీ, ఆ దీక్షకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్కు రావాల్సి ఉంటుందన్నారు. అప్పుడు సచ్చుడో లేదా తెలంగాణకు నిధులు తెచ్చుడో అనేది తేలుతుందన్నారు.
అనంతరం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని, బడ్జెట్ను సవరించి రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: కేంద్రానికి భారీ షాకిచ్చిన తెలంగాణ.. ఈ నెల 27న..
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… రేపు కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఎల్అండ్డీ రిజర్వాయర్ను సందర్శించనున్నారు. రాత్రి రామగుండంలోనే బస చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌజ్ను, ఆ తరువాత మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. అయితే, ఈ సందర్భంగా కేసీఆర్ కూడా వారితో పాటు వెళ్లి కాళేశ్వరాన్ని సందర్శిస్తారా? అంటూ చర్చిస్తున్నారు జనాలు.