RBI Raises Rapo rate : మరోసారి పిడుగు పడింది. రుణాలు మరింత భారంగా మారబోతున్నాయి. హోమ్, కార్, టూ వీలర్, పర్సనల్, గోల్డ్… ఇలా అన్ని రకాల లోన్లపై కట్టే ఈఎంఐ పెరగనుంది. ఆర్బీఐ తాజాగా రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచడమే దీనికి కారణం.
వాణిజ్య వర్గాలు, విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. తాజా పెంపుతో రెపోరేటు 6.25 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం… వడ్డీ రేట్ల పెంపు వేగం కాస్త తగ్గడానికి కారణం. ప్రస్తుతం రెపోరేటు 2018 ఆగస్టు నాటి స్థాయికి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్… కార్పొరేట్ వ్యవస్థ పటిష్ఠంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచమంతా అస్థిర పరిస్థితులు నెలకొన్న వేళ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగైన స్థాయిలో ఉందని తెలిపారాయన.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా రెపోరేటును ఈ ఏడాది ఏకంగా 225 బేసిస్ పాయింట్లు పెంచింది… ఆర్బీఐ. మే నెలలో 4.4 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు ఇప్పుడు 6.25 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం మరికొన్నాళ్లు 4 శాతానికి పైగానే ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. క్రమంగా తగ్గుముఖం పడుతూ రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 6.7 శాతానికి ఎగువనే ఉంటుందని… 2022 అక్టోంబరు-డిసెంబరు త్రైమాసికంలో 6.6 శాతానికి, 2023 జనవరి-మార్చిలో 5.9 శాతానికి, ఏప్రిల్-జూన్ మధ్య 5 శాతానికి దిగిరావొచ్చని లెక్కగట్టింది. మరోవైపు దేశ జీడీపీ వృద్ధిరేటు మాత్రం బలంగా ఉంటుందని ఆర్బీఐ ధీమాగా ఉంది. 2022-2023 ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాలను 7 శాతం నుంచి 6.8 శాతానికి కుదించిన ఆర్బీఐ… 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి- మార్చిలో 4.2 శాతంగా వృద్ధిరేటు నమోదు కావొచ్చని అంచనా వేసింది.