Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో ఈసారి అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. ఇన్ని వేలమంది ఒకేసారి పారిస్ కి వచ్చేసరికి భూమి మీద ఒత్తిడిపెరగడమే కాదు. పర్యావరణానికి కూడా చేటు కలుగుతుందని భావించిన నిర్వాహకులు వేస్టేజ్ ను కూడా వినియోగిస్తూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. అంతేకాకుండా వృథాగా పడేసే వస్తువులతో ఏమేం చేయవచ్చునో ఒక ఎగ్జిబిషన్ గా కూడా పెడుతున్నారు. అలా పర్యావరణానికి హితం చేసేలా ప్రచారం కల్పిస్తున్నారు. ఒలింపిక్స్ లో 206 దేశాలు పాల్గొంటున్నాయి.
ఈ వార్తలను కవర్ చేయడానికి అన్ని దేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తారు. సోషల్ మీడియా ఎలాగూ ఉండనే ఉంది. పర్యావరణంపై ప్రపంచం అంతటికి ఒక అవేర్ నెస్ కల్పించడానికి ఇంతకన్నా మంచివేదిక ఏముంది? అనే ఆలోచనతో చేసిన ప్రయత్నానికి పారిస్ నిర్వాహకులు అభినందనలు అందుకుంటున్నారు.
ఇంతకీ వారేం చేశారంటే.. వాడి పారేసిన షటిల్ కాక్స్ తో కాఫీ టేబుళ్లను తయారుచేశారు. అవి చూసేందుకు ఎంతో బాగున్నాయని, పక్షుల గుంపు ఒకచోట చేరినట్టు ఉందని అంటున్నారు. అలాగే పారాచ్యూట్ ల నుంచి రెగ్యులర్ గా వాడే బ్యాగ్ లు తయారుచేశారు. ఇక పారేసిన కూల్ డ్రింక్, బీరు బాటళ్లు, ఇతర సీసా మూతలతో కుర్చీలు తయారు చేశారు. వాబన్ కవర్లతో సోఫా సెట్లు చేసేశారు. ఇలా ఎన్నో వినూత్నంగా, సృజనాత్మకంగా తయారు చేయడం విశేషం. ఇక గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడానికి వేస్ట్ ప్లాస్టిక్ తో 11వేల కుర్చీలను తయారు చేశారు.
పడవల పోటీల కారణంగా అక్కడ సముద్రగడ్డికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఇవి కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి పర్యావరణానికి హితవు చేస్తుంది. అందుకే దీన్ని కాపాడేందుకు గాల్లో తేలియాడే డ్రోన్ల వంటి సూచికలను ఏర్పాటు చేశారు.
పారిస్ లో జులై నెలలో 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. వీటిని తట్టుకునేందుకు ఏసీల బదులు, పాదాల కింద పర్యావరణ హిత కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. భూగర్భంలో కొన్ని మీటర్ల లోతు నుంచి చల్లదనం ప్రసరించేలా చేస్తున్నారు. ఇంతమందికి ఏసీలు ఏర్పాటు చేస్తే అది వెదజల్లే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి వెలువడి పర్యావరణానికి నష్టం కలుగుతుందని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈత స్టేడియంకు సౌర విద్యుత్తును వాడనున్నారు. మొత్తం దీనిని సిమెంట్, ఐరన్ ని తక్కువ వాడుతూ అధిక భాగం కలపనే వాడారు. టెక్నాలజీతో అత్యద్భుతంగా ఫోటోలు, వీడియోలు తీయనున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం అంతటికి అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో పారిస్ ఒలింపిక్స్ లో విశ్వ క్రీడలు ప్రారంభం కానున్నాయి.