Gadida Guddu Posters in Hyderabad: కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ఆర్థిక బడ్జెట్ 2024-25 ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ బీహార్, ఏపీ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆ రాష్ట్రాలకు అధిక కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఎన్డీయేలో భాగంగా ఉన్న పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించారు.. మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీతోపాటు ఇతర ముఖ్య నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.
ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏపీ రాష్ట్రానికి అధిక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. అన్ని రాష్ట్రాలకు ఐఐఎంలు ఇచ్చినప్పుడు ఒక్క తెలంగాణకే ఇవ్వబోమంటూ ఎలా చెబుతారంటూ ఫైరయ్యారు. ఆది నుంచి కూడా మోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చింది గుండు సున్నా అంటూ ఎద్దేవా చేశారు.
Also Read: మాపై ఎందుకీ సవతి ప్రేమ: శ్రీధర్ బాబు
ఇది ఇలా ఉంటే.. నగరంలో పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను ఏర్పాటు చేసి నిరసనను వ్యక్తం చేసింది. ‘బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే.. కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు’ అంటూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై వినూత్న రీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు ఆ బ్యానర్లను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లుప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.