YCP EX MLA Venkatroshaiah Kilari Resign: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీ క్రీయాశీలక పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నాయకులతో ఆయన బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఆ లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపినట్లు తెలిపారు.
వైసీపీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని వెంకట రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సొంత పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంతమంది పెద్దలు సొంత నిర్ణయాలతో పార్టీని నడిపిస్తున్నారని విమర్శలు చేశారు. వైసీపీ కోసం ఎంతో కృషి చేశానని, కానీ పార్టీ లో కనీస గౌరవం కూడా నాకు లభించలేదన్నారు.
అయితే పార్టీని మోసం చేసిన కొంతమందిని చేరదీసి గౌరవించడం కలిచి వేసిందన్నారు. పొన్నూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, కొంతమంది చెప్పుడు మాటలు విని పార్టీ అధినేత టిక్కెట్ ఇవ్వలేదని, అన్ని విధాలుగా పార్టీలో అవమానాలను ఎదుర్కొన్నాను అంటూ చెప్పారు.
కాగా, కిలారి రోశయ్య 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పొన్నూరు ఎమ్మెల్చే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నేత నరేంద్రపై గెలిచి రికార్డు సృష్టించారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కానీ ఎంపీగా బరిలో దిగినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వకుండా ఎంపీగా బరిలో దింపిన నాటి నుంచి ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.