Rain news in Gujarat today(Latest telugu news): గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాల కారణంగా దారుణ ఘటన వెలుగు చూసింది. ద్వారకలో మంగళవారం ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంట్లో ఆరుగురు ఉండగా, ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టింది. జేసీబీ సహాయంతో ఇంటి శిథిలాలలను తొలగించి మృత దేహాలను వెలికితీస్తున్నారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టరాని స్థితిలో ఉన్నాయని సహాయక సిబ్బంది వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మూడంతస్తుల భవనం కుప్పకూలినట్లు సమాచారం అందిన వెంటనే ఎన్డిఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ బిపిన్ కుమార్ తెలిపారు. అనంతరం కూలిన మూడంతస్తుల కింద చిక్కుకున్న వారిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని బయటకు తీసినట్లు స్పష్టం చేశారు.
హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు..
గత కొన్ని రోజులుగా గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు అవస్తలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లాల్సిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల నీటి ఎద్దడి నెలకొంది. గుజరాత్లోని సూరత్, సౌరాష్ట్ర, దేవభూమి ద్వారకలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవాల్సి వస్తోంది. దీంతో పాటు పలు చోట్ల భారీ వర్షాలకు భవనాలు కూలిపోయినట్లు సమాచారం. ఇందులో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి బుల్డోజర్లు, హెలికాప్టర్ల సాయం తీసుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.