AP Village Volunteers System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా అనే అంశంపై గందరగోళం కొనసాగుతోంది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు పెండింగ్ లో ఉన్న పింఛన్లను కలిపి జూన్ నెలలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం కొనసాగించే అవకాశం లేదనే చర్చ కొనసాగింది.
అయితే, ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు కొంతమంది మంత్రులు వాలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి త్వరలోనే క్లారిటీ ఇస్తామని చెప్పారు. తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి క్రమంగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. కాగా, వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో దాదాపు 2 లక్షల మందికిపైగా ఉన్న వాలంటీర్లకు తమ భవిష్యత్తుపై సంధిగ్ధత నెలకొంది. ఈ తరుణంలో తాజాగా, వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.
అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన ఈ ప్రకటనతో 2 లక్షల మంది వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద రెడ్డి సభలో కోరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి అందించే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొంతకాలంగా నెలకొన్ని సంధిగ్ధానికి ఎట్టకేలకు ముగింపు పడింది.