UK Foreign Secretary In India | బ్రిటన్ దేశ విదేశాంగ కార్యదర్శి (ఫారిన్ సెక్రటరీ) డేవిడ్ లామ్మి బుధవారం భారత్ చేరుకున్నారు. బ్రెటన్ లో ఇటీవల లేబర్ పార్టీ అధికారంలో వచ్చాక.. ఇదే డేవిడ్ తొలి అధికారిక పర్యటన. ఈ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, ఇతర భారత మంత్రులతో డేవిడ్ చర్చలు జరుపనున్నారు. ఇండియా, బ్రిటన్ దేశాల మధ్య చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ప్రపంచ భద్రత, ఇతర కీలక అంశాల గురించి ఆయన ఈ చర్చల్లో ప్రస్తావన ఉంటుందని సమాచారం.
బ్రిటన్ దేశ విదేశాంగ్ కార్యదర్శి డేవిడ్ లామ్మి బుధవారం దేశ రాజధాని న్యూ ఢిల్లీ చేరుకున్నారని.. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. ఇండియా, బ్రిటన్ దేశాల బలోపేతానికి ఆయన పర్యటనలో చర్చలు ఉంటాయని రణ్ ధీర్ తెలిపారు.
ఇండియాలో డేవిడ్ లామ్మీ ఎజెండా
కామన్ వెల్త్ డెవలప్మెంట్ ఆఫీస్ అధికారిక ప్రకటన ప్రకారం.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇతర మంత్రులు, భారత దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో డేవిడ్ లామ్మి సమావేశమవుతారు. భారత్ కు బయలు దేరేముందు డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. ”లేబర్ పార్టీ అధికారంలో వచ్చాక ఇదే మా తొలి విదేశాంగ పర్యటన. 21వ శతాబ్దంలో 140 కోట్ల జనాభాతో ఇండియా ఒక సూపర్ పవర్ గా ఎదుగుతోంది. అంతేకాదు ప్రపంచంలో ఇండియా ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కూడా,” అని అన్నారు.
ఇండియాలో అధికారిక చర్చల సమయంలో ఆసియా దేశాలలో పర్యావరణానికి హాని చేయని విద్యుత్ ఉత్పాదన, వాతావరణ మార్పులపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఒక ఇండియన్ టెక్నాలజీ కంపనీని కూడా ఆయన సందర్శించనున్నారు. బ్రిటన్, ఇండియా దేశాల మధ్య వ్యాపార అభివృద్ధి, రెండు దేశాలలో ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధిపై చర్చిస్తారు. బ్రిటన్ దేశంలో నివసిస్తున్న 17 లక్షల మంది భారతీయులు, వారి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతారు.
ఇండియా-యుకె ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్
జనవరి 2022లో ఇండియా, బ్రిటన్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరం దీపావళి వరకు ఈ అగ్రిమెంట్ కు సంబంధించి అన్ని అంశాలపై ఒప్పందం చేసుకోవాలని భావించాయి. కానీ ఇంతకుముందు ఉన్న బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఆ చర్చలను వాయిదా వేస్తూ వచ్చారు. 2024లో రెండు దేశాల్లో జరిగే ఎన్నికలకు ముందు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పూర్తి చేయాలని ఇరు దేశాలు భావించినా.. రిషి సునక్ ఒక్కసారిగా బ్రిటన్ లో ముందస్తు ఎన్నికలు ప్రకటించారు. దీంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంశం మళ్లీ మరుగునపడిపోయింది.
Also Read: ట్రంప్ హత్యాయత్నం.. భద్రతా వైఫల్యం విమర్శలతో అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా!
ఇప్పుడు కొత్తగా కొలువుదీరిన లేబర్ పార్టీ ప్రభుత్వం.. ఇండియాతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ అగ్రిమెంట్ కోసం ఇరు దేశాల మధ్య 13 రౌండ్ల చర్చలు జరిగాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో 26 అంశాలున్నాయి. వాటిలో రెండు దేశాల మధ్య సరుకు, సేవా, వ్యాపార లావాదేవీలు, పెట్టుబడులు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంశాలున్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే.. రెండు దేశాల మధ్య ప్రతి సంవత్సరం నాలుగు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది.
అయితే సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు డేవిడ్ లామ్మి తెలిపారు.