Angel Tax : ఆర్థిక సంవత్సరం 2024-25ని గాను కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో సమర్పించారు. అయితే ఈ బడ్జెట్ లో స్టార్ట్ అప్ (కొత్త కంపెనీలు)లకు ప్రోత్సాహం కలిగించే విధంగా దేశంలో అమలులో ఉన్న ఏంజిల్ ట్యాక్స్ ని రద్దు చేస్తూ సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
‘కార్పొరేట్ రంగంలో కొత్త పెట్టబడులు రావాలని, స్టార్ట్ అప్ కంపెనీలు పెరగాలని.. ప్రభుత్వం ఏంజిల్ ట్యాక్స్ రద్దు చేస్తోంది,’ అని ఆమె బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఈ ప్రకటనపై భారత కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా మంచి నిర్ణయమని.. కేంద్ర ప్రభత్వ తీరుతో దేశంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అంటున్నారు.
ఫిబ్రవరి నెలలో ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నిర్మలా సీతారామన్.. పెన్షన్ ఫండ్స్, ప్రభుత్వ బాండ్లు ష్యూరిటీ గా పెట్టుబడులకు, స్టార్ట్ అప్ లకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మార్చి 2025 వరకు పొడిగించినట్లు ఆమె తెలిపారు.
ఏంజిల్ ట్యాక్స్ ఏమిటి?
ఏంజిల్ ట్యాక్స్ ని 2012లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తీసుకొచ్చారు. ఆదాయ పన్నులోని సెక్షన్ 56(2) (viib) లో ఏంజిల్ ట్యాక్స్ నిర్వచనం ఉంది. ఒక ప్రైవేటు కంపెనీ తన షేర్లు.. మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే.. ఆ ఎక్కువ ధరని కంపెనీకి ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. దానిపై 31 శాతం కంపెనీ ఏంటిల్ ట్యాక్స్ గా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కంపెనీ షేర్ విలువ రూ.100 ఉంటే.. దాన్ని కంపెనీ రూ.120 లకు విక్రయిస్తే.. ఆ అధికంగా వచ్చిన రూ.20లపై 31 శాతం ఏంజిల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: ట్రెండ్కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయి.. సింగిల్ ఛార్జింగ్పై పరుగులే పరుగులు..!
అయితే ఈ ట్యాక్స్ విధానంపై పలువురు బడా కంపెనీ ప్రతినిధులు, కొత్త కంపెనీల యజమానులు అసహనంగా ఉన్నారు. ఏంజిల్ ట్యాక్స్ విధానం వల్ల కొత్త కంపెనీలపై భారం పడుతుందని.. దీనివల్ల పెట్టుబడులు రావడం కష్టంగా మారిందని గతంలో చాలాసార్లు చెప్పారు.
అయితే ఎట్టకేలకు 12 ఏళ్ల తరువాత ఈ ఏంజిల్ ట్యాక్స్ రద్దు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్స్ చట్టం ప్రకారం.. ఏప్రిల్ 1, 2025 నుంచి ఏంజిల్ ట్యాక్స్ తొలగింపు అమలు లోకి వస్తుంది.