Madanapalle files case: ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె ఫైల్స్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగలాడితే డొంక అంతా కదులుతోంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దహనం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి వెనుక వైసీపీకి చెందిన కీలక నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కేసును సీఐడీకి అప్పగించాలనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి కీలక అనుచరుడిగా భావిస్తున్న మాధవరెడ్డిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఆయన పరారీలో ఉన్నట్లు అంతర్గత సమాచారం. ఘటన జరగడానికి ముందు పదిరోజులపాటు సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఆయన రావడం అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఆఫీసులో ఆయన ఎవర్ని కలిశాడు? అనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక అనుచరుడు మాధవరెడ్డి. బాస్ పేరు చెప్పుకుని మదనపల్లె పరిసరాల్లో భూదందాలు చేయడంలో ఆయన దిట్ట. ముఖ్యంగా కబ్జా చేసిన భూములను పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట రాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా డీకెటీ భూములు స్వాహా చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేసినట్టు దస్త్రాలు కనిపిస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారాలు బయటపడతాయనే ఉద్దేశంతో వాటిని తగలబెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదివారం రాత్రి ఫైల్స్ తగలబెట్టడానికి ముందు దాదాపు ఏడు లీటర్ల ఇంజన్ ఆయిల్ తీసుకొచ్చి పత్రాలు ఉండే బీరువాలో పెట్టినట్టు విచారణలో బయటపడింది. అసలు ఇంజన్ ఆయిల్ ఆఫీసుకు తీసుకు రావడానికి కారణమేంటి? దాన్ని సీక్రెట్గా ఉంచడమేంటి? అనేదానిపై కార్యాలయం సహాయకుడు గౌతమ్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. రాత్రి పదిన్నర నుంచి పదకొండున్నర వరకు ఆఫీసులో ఎందుకున్నాడు? అనేదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ALSO READ: హస్తినలో జగన్ మహాధర్నా, ముందే షాకిచ్చిన కేంద్రం..
మరోవైపు రెవిన్యూశాఖ కార్యదర్శి సిసోదియా అక్కడే ఉన్నారు. మరోవైపు ల్యాండ్ పత్రాలు ఖాళిపోవడంతో కొంతమంది రైతులు లబోదిబోమంటున్నారు. మొత్తానికి మదనపల్లె ఫైల్స్ వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ సీరియస్ గానే దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.