Inequality in India: ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్రాలు కూడా తమ బడ్జెట్లను ఇందుకు అనుగుణంగా రూపొందించుకుంటాయి. ప్రతి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలకు అందించే వరాల గురించి, ప్రజా సంక్షేమం, రైతులకు, కార్మికులకు, పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు కేటాయింపుల గురించి సుదీర్ఘంగా వివరిస్తారు. ఈ బడ్జెట్ పేదల అభివృద్ధికి దోహదపడుతుందని ఊదరగొడుతుంటారు. కానీ, దేశంలో పేద, ధనిక తరగతుల మధ్య అంతరం ఇంకా ఎందుకు పెరిగిపోతున్నది? కొత్త మిలియనీర్లు, బిలియనీర్లు ఒక వైపు పుట్టుకొస్తుంటే మరోవైపు కోట్లాది ప్రజలు పేదరికంలో ఎందుకు కూరుకుపోతున్నారు? ప్రభుత్వాలు ఆశించినట్టుగా బడ్జెట్ అమలు చేసినా.. పేదలు ఎందుకు ఇంకా దిగజారిపోతున్నారు? మన దేశంలో 2000 నుంచి ఈ అంతరం విపరీతంగా పెరిగిపోతున్నది. అసలు బ్రిటీష్ పాలనలో కంటే కూడా ఇప్పుడు ఈ అంతరం పెరిగిందని జాతీయ, అంతర్జాతీయ మీడియాలోనూ విశ్లేషణలు వచ్చాయి. ఫ్రంట్ లైన్ పత్రిక ఈ ఏడాది ప్రచురించిన ఓ కథనం ప్రకారం మన దేశంలో టాప్ 1 శాతం సంపన్నుల చేతిలో దేశంలోని 40 శాతం సంపద ఉన్నది. అడుగున్న ఉన్న 50 శాతం పేదల వద్ద దేశ సంపదలో కేవలం 15 శాతం మాత్రమే ఉన్నది. ధనిక, పేదల మధ్య అగాథంగా మారిపోయిన అంతరాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
2022లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీటివ్నెస్ అనే సంస్థ స్టేట్ ఆఫ్ ఇనీక్వాలిటీ ఇన్ ఇండియా అనే ఓ నివేదిక విడుదల చేసింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2019-20 ప్రభుత్వ సర్వే నుంచి వివరాలు తీసుకుని ఈ నివేదిక తయారు చేశారు. ఇందులో ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. మన దేశంలో 90 శాతం మంది నెలకు రూ. 25 వేల జీతం కూడా సంపాదించడం లేదని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. అంటే మీరు నెలకు రూ. 25 వేల జీతం సంపాదిస్తున్నారంటే దేశంలో ఉత్తమ స్థాయిలో ఉన్న పదిశాతం మందిలో మీరు ఉన్నట్టుగా భావించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆదాయపన్ను శ్లాబులపై ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ శ్లాబులతో మధ్యతరగతి ప్రజలకు గొప్ప ప్రయోజనాన్ని అందించిందని సాధారణంగా అధికారపక్షం చెబుతూ ఉంటుంది. కానీ, ఈ సర్వే ప్రకారం 90 శాతం మంది కనీసం ఈ పరిధిలోకి కూడా రారు. ఎక్కువగా ఊదరగొట్టే ఈ అంశం మెజార్టీ ప్రజలకు వర్తించనే వర్తించదని తేలిపోతున్నది.
Also Read: నా బిడ్డ జైలులో ఉంటే నాకు బాధ ఉండదా..?: కేసీఆర్
ఇక పరోక్ష పన్నుల గురించి మాట్లాడితే.. ఈ పన్నులు ధనికుల కంటే పేద, మధ్యతరగతి వర్గాలే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నాయని 2022లో విడుదలైన ఆక్స్ఫామ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ అట్టడుగున్న ఉన్న 50 శాతం పేద జనాభా నుంచే జీఎస్టీ రూపంలో 64 శాతం సొమ్ము ప్రభుత్వానికి చేరుతున్నది. అదే అగ్రభాగంలో ఉన్న 10 శాతం ధనికుల నుంచి కేవలం 4 శాతమే జీఎస్టీ వసూలు అవుతున్నది. కార్పొరేట్ ట్యాక్స్ కుదింపు, ప్రోత్సాహకాలతో ఈ సంపన్నులే లబ్దిపొందుతున్నారు.
ధనికులకు, పారిశ్రామికవేత్తలకు పన్ను భారం తగ్గిస్తే వారి ద్వారా చాలా మంది ఉపాధి పొంది.. అది పరోక్షంగా పేద ప్రజలకు ఉపకరిస్తుందనే సాధారణ ఆలోచన ఒకటి ఉన్నది. ట్రికిలింగ్ డౌన్(బొట్లు బొట్లు పై నుంచి కిందికి కారుతుంది) అన్నట్టుగా సంపన్నులకు లబ్ది చేకూరిస్తే ఆ ప్రయోజనాలు అంతిమంగా దిగువన ఉన్న పేదలకు ఒనగూరుతాయనే ఆలోచన అది. కానీ, ఇది అవాస్తవం అని, పేద, ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించాలంటే సూపర్ రిచ్లకు పన్ను వేయడమే సరైన మార్గం అని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్యాబ్రియేలా బచర్ వివరించారు.
Also Read: ఆ ఫ్యాషన్ షోలో నరేంద్ర మోదీ ర్యాంప్ వాక్.. ఎలన్ మస్క్ ట్వీట్
ఈ నేపథ్యంలో బడ్జెట్లు పేదరికానికి ప్రభావవంతంగా ఉపయోపగపడటం లేదని, పేదరికం నుంచి వారిని స్వల్ప కాలంలోనే బయటపడేయటం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మరో విషయాన్ని కూడా వారు గుర్తు చేశారు. గొప్పగా ప్రకటించే బడ్జెట్లో కేటాయింపులు జరిపినా.. ప్రకటించినట్టుగా నిధుల విడుదల జరగవనీ చెబుతున్నారు.