India defeated Nepal by 82 Runs: మహిళల టీ20 ఆసియాకప్ మెగా టోర్నీలో భారత్ దూసుకెళ్తోంది. టోర్నీలో భాగంగా నేపాల్ తో మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సెమీస్ కు రీచ్ అయ్యింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. 179 పరుగుల లక్ష్య ఛేదనకు ప్రయత్నించిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 96 పరుగులు తీసింది. ఓపెనర్ గా గ్రౌండ్ లోకి దిగిన సీతా రానా మాగర్ 18 పరుగులు తీశారు. ఇటు భారత బౌలర్లు నేపాల్ ప్లేయర్లు పరుగులు తీసేందుకు అవకాశం ఇవ్వలేదు. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, రధా యాదవ్, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. రేణుక సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: కేంద్ర బడ్జెట్.. క్రీడలకు ఎప్పటిలా అవే నిధులు
అయితే, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు తీసింది. ఓపెనర్లలో షెఫాలీ వర్మ (81 – 48 బంతుల్లో ఒక సిక్స్, 12 ఫోర్లు), హేమలత (47- 42 బంతుల్లో ఒక సిక్స్, 5 ఫోర్లు) పరుగులు తీశారు. నేపాల్ బౌలర్లు.. సీతారాన మగర్ 2 వికెట్లు తీయగా, కబితా జోషి ఒక వికెట్ పడగొట్టింది.
ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి టీమిండియా దూకుడుగా ఆడుతూ వచ్చింది. తొలి ఓవర్ లోనే రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు తీశారు. ఓ వైపు నేపాల్ బౌలర్లు విరుచుకుపడుతున్నా.. బౌండరీల మోత మోగించారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
తాజా విజయంతో గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. నేపాల్, యూఏఈ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.