Sports Ministry allocated slightly increased budget: కేంద్ర బడ్జెట్ లో ఈసారి కూడా క్రీడలకు ప్రాధాన్యత కల్పించలేదు. భారతదేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ ద్రష్ట్యా మిగిలిన ఆటలకు కూడా సమ ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ ఏళ్ల తరబడి వినిపిస్తోంది. ఈ అంశాన్ని పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే అవే నిధుల కేటాయింపులు జరిగాయి. ఇలాగైతే ఆటలకు ఎప్పటికి ప్రాధాన్యత పెరుగుతుంది? ఆటగాళ్లలో నైపుణ్యం ఎప్పుడు పెరుగుతుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంటు సమావేశాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రూ.3442.32 కోట్లు కేటాయించారు. గతంతో పోల్చితే కేవలం రూ.45.36 కోట్లు మాత్రమే పెంచారు. కేటాయించినవి కూడా భారతదేశంలోని క్రీడా ప్రాంగణాలు, నిర్వహణ, సిబ్బంది జీతాలు, శిక్షణ వీటికే సరిపోతాయని అంటున్నారు. మారుతున్న కాలంతో పాటు నిధులు పెంచితేనే కదా…ఆటగాళ్లలో శక్తి, నైపుణ్యాలు పెరిగి పతకాలు తెస్తారని అంటున్నారు.
Also Read: పాక్-భారత్ టీ 20 సిరీస్.. అంతా ఉత్తుత్తిదే: పీసీబీ
ఎప్పుడో నాలుగేళ్లకు జరిగే ఒలింపిక్స్ గేమ్స్ కి, ఒక ఆరు నెలల ముందు నుంచి డబ్బులు ఖర్చుపెట్టి సానపెడితే ఫలితం ఏముంటుంది? నాలుగేళ్ల నుంచి వారిని మెలికల్లా తయారుచెయ్యాలి కదా అంటున్నారు. ఇకపోతే గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖేలో ఇండియాకు అత్యధికంగా రూ.900 కోట్లు కేటాయించారు. ఇక నేషనల్ స్పోర్ట్స్ ఫెరరేషన్లకు రూ.340 కోట్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ. 822.60 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇక నేషనల్ డోప్ టెస్టింగ్ ట్యాబొరేటర్ కి రూ.22 కోట్లు కేటాయించారు.
ఎన్ని నిధులు కేటాయింపులు జరిగినా, చివరికి విడుదల చేసేటప్పుడు ఆ స్థాయిలో రావడం లేదనే విమర్శలున్నాయి. అంతేకాక స్పోర్ట్స్ శాఖల్లో విపరీతమైన అవినీతి పేరుకుపోయిందనే విమర్శలున్నాయి, అలాగే రాజకీయ నాయకుల రికమండేషన్ల తాకిడి ఎక్కువగా ఉందని, దీనివల్ల నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు దశాబ్దాల తరబడి వినిపిస్తున్నాయి. అన్ని శాఖల్లో ప్రక్షాళన జరుగుతున్నా క్రీడాశాఖ వైపు మాత్రం ఎవరూ చూడటం లేదని అంటున్నారు. ఈ ఏడాదైనా విజిలెన్స్ శాఖను ఇటువైపు చూడమని చెబుతున్నారు.