Union Budget 2024: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రాంతీయ పార్టీలపై క్లాస్ తీసుకున్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత, స్వీయ అస్తిత్వం వంటి అంశాలపై కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో నొక్కి చెప్పారు. శాసించి డిమాండ్లు సాధించుకోవాలని, యాచించి కాదని అన్నారు. యాచిస్తే ఏమీ రాదని తెలిపారు. ఇవాళ ప్రాంతీయ పార్టీ(బీఆర్ఎస్) ఎంపీలు పార్లమెంటులో ఉంటే ఎలా ఉండేదో ఒకసారి ప్రజలు ఆలోచించాలన్నారు. కేటీఆర్ ఇది వరకే ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత గురించి పలుమార్లు మాట్లాడారు. ముఖ్యంగా ఏపీలో టీడీపీ గెలుపును ప్రస్తావిస్తూ.. కేంద్రం నుంచి టీడీపీ నిధుల సాధన గురించి వివరిస్తూ ప్రాంతీయ పార్టీలకు ఉన్న ప్రాధాన్యత వివరించారు. నేడు కేంద్ర బడ్జెట్ తెలంగాణకు గుండు సున్నా కేటాయించిందని ఫైర్ అవుతూ ప్రాంతీయ పార్టీకి ఎక్కువ ఎంపీలు ఉండి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావని పేర్కొన్నారు.
తెలుగు కోడలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు కూడా బడ్జెట్లో నిధులు ప్రకటిస్తారని ఆశించామని, కానీ, ఆమె ఏమీ కేటాయించలేదని కేటీఆర్ అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పదాన్ని ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం బాధాకరం, శోచనీయం అని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంటూ ప్రస్తావించారని గుర్తు చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీ, తెలంగాణ రెండూ ఉంటాయని, కానీ, ఆమె ఏపీకి మాత్రమే నిధులు కేటాయించి తెలంగాణకు మొండి చేయి చూపడం దారుణమని పేర్కొన్నారు. ఏపీకి నిధులు కేటాయించడంపై తమకు అభ్యంతరాలేమీ లేవని, తోటి తెలుగు రాష్ట్రం అభివృద్ధి కావడం సంతోషమేనని, కానీ, తెలంగాణకు నిధులు కేటాయించకపోవడమేమిటనేదే తమ ప్రశ్న అని వివరించారు. గతంలో లాగే ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా కేటాయించారన్నారు.
Also Read: కింగ్ మేకర్లను ప్రసన్నం చేసుకున్న కేంద్రం.. బడ్జెట్లో ఏపీ, బిహార్కు వరాలు
కేంద్ర బడ్జెట్.. ఏపీ, బిహార్ బడ్జెట్లా ఉన్నదని, మిగిలిన రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి అన్నేసి సార్లు ప్రస్తావించిన పునర్విభజన చట్టంలో కేంద్రం తెలంగాణకు హామీ పడిన ములుగు గిరిజన యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ వంటివాటిపై ఒక్క మాట అయినా మాట్లాడలేదని మండిపడ్డారు. తెలంగాణకు ఇండిస్ట్రియల్ కారిడార్, ఐఐఎం, ఐసర్ వంటి జాతీయ విద్యా సంస్థలు, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు కావాలని ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, కానీ, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదని అన్నారు. గిరిజన యూనివర్సిటీని ప్రకటించి ప్రారంభించినట్టే చేశారని, కానీ, నిధులు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు.
ఇక తెలంగాణ నుంచి ఎన్నికైన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ఉన్నారని, కానీ, ఒక్కరైనా బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై ప్రశ్నించలేదని, కనీసం నిరసన కూడా ప్రకటించలేదని పేర్కొన్నారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వారు సరైన నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.