Supreme Court refused to order re-exam: నీట్ యూజీ -2024 ఎగ్జామ్ పేపర్ లీకైన మాట వాస్తవమేనంటూ సుప్రీంకోర్టు పేర్కొన్నది. నీట్ అంశంపై వాదనలు ముగిశాయి. దీంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం.. పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
‘బీహార్లోని పట్నా, ఝార్ఖండ్లోని హజారీబాగ్లోని కేంద్రాల్లో నీట్-యూజీ 2024 ఎగ్జామ్ పేపర్ లీకైందన్న మాట వాస్తవం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారుగా 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తున్నది. వీరిపై చర్యలు తీసుకోవాలి. అయితే, పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలేమీ లేవు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణ చేయలేం. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహిస్తే 24 లక్షల మంది ఇబ్బందిపడుతారు. వారిలో అనేకమంది వందల కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు’ అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
Also Read: బంగారం కొంటున్నారా..? అయితే ఈ భారీ శుభవార్త మీ కోసమే..
ఇదిలా ఉంటే.. నీట్ పరీక్షను ఈ ఏడాది మే 5న దేశ వ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దాదాపుగా 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు మొదటి ర్యాంక్ రావడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతమందికి టాప్ ర్యాంక్ రావడం వెనుక గ్రేస్ మార్కులు కారణమంటూ ఇటీవల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరసన కార్యాక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో అలఖ్ పాండేతోపాటు మరికొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది.
మరోవైపు ఈ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు పార్లమెంటులో చర్చను లేవనెత్తాయి. కేంద్రం తీరును తప్పుబట్టాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో పార్లమెంటులో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.