Gold and Silver Prices Fall by up to Rs 4000: కేంద్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టింది. దేశీయ తయారీని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈసారి బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీపై భారీగా కోతలు విధించింది. ఫలితంగా విలువైన లోహాలు, ఎలక్ట్రానిక్, కీలక ఔషధాల ధరలు కొంతవరకు తగ్గనున్నాయి. అయితే, మరికొన్ని వస్తువులపై మాత్రం ఈ డ్యూటీని పెంచింది.
అయితే, చాలారోజుల నుంచి నగలు, వజ్రాల ఎగుమతి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ ఈరోజుతో నెరవేరినట్టయ్యింది. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈ బడ్జెట్లో తగ్గించింది. వెండి, పుత్తడి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి కుదించింది. ప్లాటినమ్, పల్లాడియం, ఓస్మియమ్, రుథేనియం, ఇరీడియంపై 15.4 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది కేంద్రం. ఈ నిర్ణయంతో భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నారు. తక్కువగా ముడిబంగారాన్ని కొనుగోలు చేసి, దేశీయంగా దానికి అదనపు విలువను జోడించి విక్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read: బడ్జెట్ పూర్తి వివరాలు.. ఏ ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి?.. ఏవి తగ్గనున్నాయి??
బంగారం, నగల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఇటు బంగారం ప్రియులు కూడా ప్రస్తుతం బంగారం రేటు ఎంత ఉంది.. ఇప్పుడు కొనుగోలు చేస్తే ఎంత అవుతుంది..? గతంలో ఎంత ఉండే? వంటి వివరాలను సేకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బడ్జెట్ ఎఫెక్ట్ అప్పుడే పుత్తడిపై పడింది. బంగారం మార్కెట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. మధ్యాహ్నానికి ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ. 4 వేలు తగ్గి రూ. 68,500 కు చేరింది. వెండి కూడా కిలో రూ. 2,500 తగ్గి రూ. 84,275 వద్ద ట్రేడయ్యింది.