Minister Sridhar Babu: లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణను పూర్తిగా మరిచిపోయారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా రాజకీయాలతో కూడుకుని ఉందని, ఇది ప్రజలకోసం పెట్టిన బడ్జెట్ లా లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీడీపీ, జేడీయూ ల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్ లో బిహార్ కు రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం, ఏపీకి రూ.15వేల కోట్ల నిధులు, పోలవరం పూర్తి చేసేందుకు నిధులను కేటాయించిందన్నారు. ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు.
Also Read : కోటి ఆశల తెలంగాణ ప్రజలకు.. కేంద్ర బడ్జెట్లో నిరాశ..
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించడంలో కేంద్రం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటోన్న బీజేపీ నేతలు ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోవడంపై నోరు మెదపడం లేదన్నారు.
కేంద్ర బడ్జెట్ తర్వాతే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందన్న మంత్రి శ్రీధర్ బాబు.. ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. బడ్జెట్ పై అసెంబ్లీలో మూడు రోజులపాటు చర్చలు జరుగుతాయని చెప్పారు. ప్రభుత్వం విమర్శలు చేస్తోన్న బీఆర్ఎస్ కు అసలు మాట్లాడే హక్కు లేదన్నారు. శాంతి భద్రతల వైఫల్యం, చేనేత కార్మికుల సమస్యలు, రైతుల రుణమాఫీలపై ప్రశ్నించే బీఆర్ఎస్.. తామేం చేశారో ఒకసారి పరిశీలించుకోవాలని చూశారన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.