Train : ఓ యువతి రైలు దిగే క్రమంలో అనూహ్యంగా ప్రమాదం బారిన పడింది. ఆ విద్యార్థి కళాశాలకు తొందరగా వెళ్లాలనే ఆతృతతో వేగంగా రైలు దిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రైలుకు -ఫ్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. దాదాపు గంటన్నరపాటు నరకయాతన అనుభవించింది. చాలాసేపు ఆమెను పైకిలాగేందుకు రైల్వేసిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు అతికష్టంమీద ఆమెను రక్షించారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో జరిగింది.
అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ ఎక్కింది. ఆ రైలు దువ్వాడ స్టేషన్ కు చేరుకున్న సమయంలో ఆ యువతి ప్రమాదం బారిన పడింది. స్టేషన్లో రైలు దిగుతున్న క్రమంలో రైలు-ఫ్లాట్ఫామ్ మధ్యలో శశికళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమె ఇరుక్కున్న చోట ఫ్లాట్ఫామ్ను కట్ చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి శశికళను బయటకు తీశారు.
బాధితురాలు శశికళను వెంటనే చికిత్స కోసం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది శ్రమతో ఆ యువతి ప్రాణాలు దక్కించుకుంది. ఈ ఘటనతో గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది.