Narasapuram MPDO Missing: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు మిస్సింగ్ వ్యవహారం చివరకు విషాదాంతమైంది. ఆయన మృతదేహాన్ని ఏలూరు కాల్వలో విపత్తు సహాయక బృందాలు గుర్తించాయి.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు జూలై 15 నుంచి కనిపించకుండా పోయారు. సెలవుపై ఆయన ఇంటికి వచ్చారు. విజయవాడలోని కానూరు మహాదేవపురం కాలనీలో ఉంటున్నారు. ఈనెల 15న మచిలీపట్నం వెళ్తున్నానని చెప్పి బయలుదేరారు. అదే రోజు రాత్రి 10 గంటలకు భార్యకు ఫోన్ చేసి తాను రావడానికి ఆలస్యమవుతుందని, ప్రస్తుతం బందరులో ఉన్నానని చెప్పారు.
వెంకటరమణారావు బర్త్ డే జూలై 16. మరసటి రోజు భర్త రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చింది. అందరూ జాగ్రత్త అంటూ భార్యకు ఫోన్లో మెసేజ్ పంపించారు. అనుమానం వచ్చిన భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, రమణారావు వాహనం మచిలీపట్నం రైల్వేస్టేషన్ లో గుర్తించారు.
ఎంపీడీవో రమణారావు అదృశ్యంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో సమగ్ర విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఫెర్రీ బకాయిల వివరాలు లిస్టు రెడీ చేయాలని కోరారు. ఈ జాబితాలో వైసీపీకి చెందిన కీలక నేతలు బకాయలు పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మిస్సింగ్ అయ్యారనే వార్తలూ లేకపోలేదు. అంతేకాదు ఎంపీడీవో అదృశ్యానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం.
నరసాపురంలో ఉన్న రేవు నుంచి పంటు నిర్వహించేవారు. నరసాపురం, కోనసీమ జిల్లాలకు చెందిన అధికారులు దీన్ని నిర్వహించేవారు. ఎన్నికల కోడ్ తర్వాత రేపు నిర్వహణకు వేలం జరగలేదు. ఏప్రిల్ ఒకటి నుంచి రేవు నిర్వహణకు రోజుకు లక్ష చెల్లించేలా పాటదారులకు కేటాయించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని తగ్గించారు.
ALSO READ: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..ఇక అమరావతికి మహర్ధశ
జూలై మూడు వరకు నిర్వహణకు సంబంధించిన నగదును పాటదారుడు ప్రభుత్వానికి జమ చేయలేదు. దీంతో ఉన్నతాధికారులు ఎంపీడీవోపై ఒత్తిడి పెంచారు. అంతేకాదు మాజీ విప్ ప్రసాద్, తనను ఇబ్బంది పెట్టినట్టు వాట్సాప్ లేఖలో ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కారణాల నేపథ్యమే ఆయన చనిపోవాలని నిర్ణయానికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఎంపీడీవో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారనే అనుమానులు లేకపోలేదు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.