Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు సింహయాజి చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో A3 నిందితుడిగా ఉన్న సింహయాజికి వారం రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. అయితే.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా షూరిటీలు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. దీంతో సింహయాజి విడుదలకు ఆటకం ఏర్పడింది. ఆ ప్రక్రియ పూర్తికావడంతో ఇప్పుడు సింహయాజి విడుదలయ్యారు. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజికు వారం క్రితమే తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కేసులు పెండింగ్లో ఉండటంతో రామచంద్రభారతి, నంద కుమార్ ఇంకా జైల్లోనే ఉన్నారు.
మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తునకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ను నిందితులుగా చేర్చుతూ పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరని తేల్చిచెప్పింది. కానీ పోలీసులు వారిని నిందితులుగా పేర్కొంటూ మెమో దాఖలు చేయడంపై ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్.. ఇప్పటి వరకు సిట్ విచారణకు హాజరుకాలేదు. తమపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొంటూ హైకోర్టులో పిటషన్లు దాఖలు చేశారు. కేరళకు చెందిన డాక్టర్ జగ్గుస్వామికి జారీ చేసిన సీఆర్పీసీ 41ఎ నోటీసు అమలును నిలిపివేస్తూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే కేసులో బి.ఎల్.సంతోష్కు సిట్ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఇరుపక్షాల వాదనలు విని నోటీసుల చట్టబద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని సిట్ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. డిసెంబర్ 13న హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.