Indian Athletes get government spent RS.470 Cr for Paris Olympics: భారతదేశం ఒలింపిక్స్ కి ఈసారి ఘనంగా వెళుతోంది. వివిధ విభాగాల్లో 117మంది క్రీడాకారులు అత్యున్నత శిక్షణ పొంది మరీ విశ్వ క్రీడల్లో పాల్గొననున్నారు. భారత ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు పతకాలు తేవాలని చెప్పి సుమారు రూ.470 కోట్లు ఖర్చు చేశారు. ఇలా మన క్రీడావీరులు మరింత ఆత్మవిశ్వాసంతో, ప్రపంచ స్థాయిలో జరిగే పోటీలకు సంసిద్ధులై వెళుతున్నారు. ఇది భారత క్రీడలకు శుభపరిణామం అని అంటున్నారు.
ఇంతకుముందు వరకు ప్రజలు ఏమనుకునేవారంటే.. 140 కోట్ల మంది భారతీయులున్నారు. ఒక్క పతకం తేవడానికి ముక్కుతున్నారు మూలుగుతున్నారు అని విమర్శించేవారు. అంటే అది బాధ, ఆవేదన అని చెప్పాలి. క్రీడల్లో చెప్పాలంటే ఎక్కడ లేని అవినీతి ఉందనే విమర్శలున్నాయి. అలాగే రికమండేషన్లు, ప్రాంతీయ తత్వాలు ఇవన్నీ కూడా అసలైన క్రీడానైపుణ్యం ఉన్నవారిని వెలుగులోకి రానివ్వడం లేదని అంటారు.
అంతకుమించి క్రీడా మంత్రిత్వశాఖల్లో పేరుకుపోయిన అవినీతి, నియంత్రణ లోపం ఇలాంటివెన్నో ఉన్నాయి. అంతెందుకు ఇటీవల రెజ్లర్లందరూ రోడ్డెక్కి, తాము సాధించిన పతకాలను తిరిగిచ్చేస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలెన్నో ఉన్నాయి. చాలామంది క్రీడాకారులు మౌనంగా భరిస్తారు.
కొందరు అలాగే అరాకొర వసతులతో నేర్చుకుని, పట్టుదలతో పతకాలు సాధిస్తుంటారు. లేదంటే అవమానభారంతో రిక్తహస్తాలతో తిరిగి వస్తుంటారు. నేడు అలాంటి పరిస్థితి లేదు. మనలో సత్తా ఉంటే చాలు, ప్రపంచ క్రీడాకారులతో పోటీపడేలా కోట్ల రూపాయలు ఖర్చు చేసి శిక్షణ ఇప్పించారు.
Also Read: శ్రీలంకలో టీమిండియా, నేటి నుంచి ప్రాక్టీసు.. ఆ తర్వాత రోహిత్, కోహ్లి..
టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం పేరుతో ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఒలింపిక్స్ మరో మూడురోజుల్లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే మన క్రీడాకారులు ఎన్నో ఆశలతో పారిస్ లో అడుగుపెట్టారు. అథ్లెటిక్స్ లో 29 మంది బరిలో ఉన్నారు. షూటింగులో 21 మంది, హాకీలో 19 మంది అత్యధికంగా ఉన్నారు. ఇక గోల్ఫ్ (4), టెన్నీస్ (3), స్విమ్మింగ్ (2), సెయిలింగ్ (2), రెజ్లింగ్ (6), ఆర్చరీ (6), టేబుల్ టెన్నీస్ (8), బ్యాడ్మింటన్ (7) ఉన్నారు.
అధికంగా ఆశలు పెట్టుకున్న వారిపై ఖర్చు కాస్త ఎక్కువ చేశారు. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్) రూ. 5.72 కోట్లు, పీవీ సింధూ (బ్యాడ్మింటన్ ) రూ.3.13 కోట్లు, సాత్విక్, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్) రూ. 5.62 కోట్లు ఇలా అన్నీ కోట్ల రూపాయలే ఖర్చు చేశారు. మరి మనవాళ్లు ఎలా పోటీపడతారో వేచి చూడాల్సిందే.