Heavy Rains Alert by IMD to 9 States(Telugu news live today): ఒకరోజు కాదు.. రెండ్రోజులు కాదు.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వారంరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడినా.. రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో దేశమంతా వర్షాలు దండిగా పడుతున్నాయి. ఫలితంగా చాలా రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ అస్సాం రాష్ట్రం వరదలతో అతలాకుతలమైంది. పదులసంఖ్యలో ప్రజలు చనిపోయారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో పాటు ఎగువ నుంచి వరదనీరు వస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగాయి.
అటు ఏపీలో ప్రకాశం బ్యారేజీకి, పోలవరం ప్రాజెక్టులతో పాటు ప్రధాన బ్యారేజీలు, ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. తెలంగాణలో పరిస్థితి కూడా అలాగే ఉంది. భద్రాచలం వద్ద గోదావరి ఉరకలేస్తోంది. ఇప్పటికే రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం 51.5 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీకి వరద పోటెత్తడంతో.. 13.09 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Also Read : ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. స్తంభించిన జనజీవనం
భారీవర్షాలకు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అన్ని ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మండుటెండల నుంచి కాస్త ఉపశమనం కలిగే వర్షాలు పడితే బాగుండన్న ప్రజల కోరికను వరుణ దేవుడు కాస్త గట్టిగానే విన్నట్టున్నాడు. కురిసింది చాలు.. ఇక వర్షాలు వద్ద బాబోయ్ అంటున్నా వింటున్నట్టు లేడు. ఇంకా 5 రోజులపాటు వర్షాలు కురుస్తాయని తాజాగా భారత వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో మరో 2 రోజులు.. గుజరాత్, మహారాష్ట్ర, గోవాలతో పాటు.. మరో 7 రాష్ట్రాలకు భారీ వర్షసూచన ఉందని తెలిపింది. ఈ మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
నేడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే.. జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, అస్సాం, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది ఐఎండీ.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.